ఆడ పులిని కోసం ఆదిలాబాద్ లోకి!!
మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవులకు పులుల రాక పెరిగింది.
మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవులకు పులుల రాక పెరిగింది. భీంపూర్, జైనథ్ మండలాలకు ఆనుకొని ప్రవహిస్తున్న పెన్గంగా నదిని దాటి జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రస్తుతం పులుల మేటింగ్ కావడంతో ఆడ పులిని వెతుక్కుంటూ మగపులులు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లోకి వస్తున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యంలో సుమారు 25 పులులు ఉన్నాయి. ప్రతి ఏడాది ఈ సీజన్లో మేటింగ్ కోసం అక్కడి నుంచి పులులు ఆదిలాబాద్ జిల్లాలోకి వస్తుంటాయి. ఈ ఏడాది కూడా ఇప్పటికే మూడు పులులు, ఒక చిరుత జిల్లాకు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పులుల రక్షణకు చర్యలతో పాటు పులుల బారిన పడకుండా అటవీ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.