Weather Report : పిడుగులు.. ఉరుములు.. మెరుపులు.. కూల్ వెదర్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇప్పటికే అక్కడక్కడా వానలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. అలాగే పలుచోట్ల పిడుగులు పడే అవకాశముందని, రైతులు, పశువుల కాపర్లు తగిన జాగ్రత్తలు వహించాలని, చెట్ల కింద ఉండకుండా చూసుకోవాలని కోరారు. మరొకవైపు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఎక్కడా భారీ వర్షాలు పడవని మాత్రం తెలిపింది.
మరో రెండు రోజుల పాటు...
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు ఉరుములతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరొకవైపు కొన్ని చోట్ల పొడి వాతావరణం నెలకొని ఉంటుందని తెలిపింది. పొగమంచు ప్రభావం కూడా ఉదయం పూట ఉంటుందని, గన్నవరం ఎయిర్ పోర్టులో విమానాలు ల్యాండింగ్ కు కొంత అసౌకర్యం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. రాయలసీమలో పొడి వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని పేర్కొంది.
వాతావరణం ఒక్కసారిగా మారి...
తెలంగాణలోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఉపరితల ద్రోణి కారణంగా తేలికపాటి వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఉష్ణోగ్రతలు కనిష్టంగానే నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. రైతులు తమ పంట ఉత్పత్తులను కాపాడుకునే ప్రయత్నం చేయడం మంచిదని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మార్చి నెల నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.