Weather Report : వాతావరణ శాఖ కీలక అప్ డేట్.. మార్చి నుంచే మొదలట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దీంతో పాటు ఉపరితల ఆవర్తనం, ద్రోణ ప్రభావం కారణంగా ఏపీలో రెండు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనూ వానలు పడతాయని చెప్పింది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మరొకవైపు తెలంగాణ లో వడగళ్ల వానలు పడే అవకాశముందని, అదే సమయంలో కొన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
అల్పపీడనం ప్రభావంతో...
తమిళనాడు నుంచి మహారాష్ట్ర వరకూ విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో పాటు అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పింది. దక్షిణ కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉదయం వేళ ఏపీలో పొగమంచు ప్రభావం కూడా అధికంగా ఉంటుందని, గన్నవరం, విశాఖ ఎయిర్ పోర్టులో విమాన రాకపోకలకు ఉదయం ఎనిమిది గంటల వరకూ ల్యాండింగ్ కు అంతరాయం ఏర్పడనుందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇక రాయలసీమలోనూ ఉష్ణోగ్రతలు కనిష్టంగానే నమోదవుతాయని, తేలికపాటి జల్లులు పడే అవకాశముందని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పింది. కొన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో వాతావరణం ఇలా...
తెలంగాణలోనూ భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే నిన్న కొంత ఎండ వేడిమి తగ్గింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా కొంత చల్లటి వాతావరణం నెలకొంది. ఉదయం, రాత్రివేళల్లో కొంత చలి గాలులు ఇంకా వీస్తున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు మాత్రం గరిష్టంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే ఉదయం వేళ కొన్ని చోట్ల పొగమంచు కూడా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాహనదారులు ఉదయం వేళ కొంత జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించింది.