Weather Report : రానున్న రెండు రోజులు అతి భారీ వర్షాలేనట.. హై అలెర్ట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనద్రోణి ఫలితంగా ఈ నెల పదో తేదీ వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికారుల కూడా అప్రమత్తంగా ఉండాలని అలెర్ట్ చేసింది.
ఈ నెల పదో తేదీ వరకూ...
ప్రధానంగా తెలంగాణలో ఈ నెల పదో తేదీ వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లా్లోల ఈరోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. దాదాపు పది జిల్లాలకు పైగానే వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ను జారీ చేయడంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయింది. పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల,కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని తెలిపింది.
ఈ ప్రాంతాల్లో అతి భారీవర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లోనూ రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తరకోస్తా జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా ప్రాంతంలోనూ ఇదే రకమైన పరిస్థితి ఉంటుందని తెలిపింది. రాయలసీమలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని చెప్పింది.