Weather Report : నాలుగు రోజులు భారీ వర్షాలు.. అలెర్ట్ గా ఉండాల్సిందేనట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కుండ పోత వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు...
ఈరోజు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతవరణ శాఖ చెప్పింది. కొన్ని జిల్లాలలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్,ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్నిప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశముందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలే చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులకు అలెర్ట్ జారీ చేసింది.
ఉరుములు, మెరుపులతో...
ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఉరుములు మెరుపులతో గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్నిజిల్లాల్లో ఈదురుగాలులతో కూడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు, కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.