ఐదున్నర రూపాయలు అధికంగా వసూలు చేసిన బిర్యానీ హౌస్.. రూ.55 వేలు జరిమానా !

బిల్లు రూ.1075 అయింది. జీఎస్టీతో కలిపి మొత్తం బిల్లు రూ.1127 అయింది. అందులో మినరల్ వాటర్ బాటిల్ కు అదనంగా..

Update: 2022-03-04 06:09 GMT

హైదరాబాద్ :ఈ మధ్యకాలంలో రెస్టారెంట్లలో బిర్యానీ కంటే.. అక్కడ లభించే వాటర్ బాటిల్స్, సాఫ్ట్ డ్రింక్స్ రేట్లే ఎక్కువగా ఉంటున్నాయి. బయట ఉన్న ధర కంటే.. బిర్యానీ పాయింట్లలో వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ పై అధిక ధర వసూలు చేస్తున్నాయి. ఎలాగూ వచ్చాం.. ఇక తప్పదన్నట్లు కస్టమర్లు కూడా రెస్టారెంట్లు వేసిన రేట్లకే కొనుగోలు చేస్తున్నారు. అలా ఓ రెస్టారెంట్ చేసిన పనికి వినియోగదారుల ఫోరం రూ.55 వేలు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకుంటున్న చిలుకూరి వంశీ.. తన నలుగురు స్నేహితులతో కలిసి తిలక్ నగర్ లోని లక్కీ బిర్యానీ హౌస్ కు వెళ్లి బిర్యానీ తిన్నారు.

బిల్లు రూ.1075 అయింది. జీఎస్టీతో కలిపి మొత్తం బిల్లు రూ.1127 అయింది. అందులో మినరల్ వాటర్ బాటిల్ కు అదనంగా రూ.5.50 అదనంగా వేశారు. దానిని గుర్తించిన వంశీ.. అదనంగా రూ.5.50 ఎందుకు వేశారంటూ హోటల్ సిబ్బంది ప్రశ్నించగా.. వారు దురుసుగా సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా తన స్నేహితుల ముందే వంశీని అవమానించారు. దాంతో వంశీ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. వంశీ ఫిర్యాదు మేరకు జిల్లా వినియోగదారుల కమిషన్ -2 బెంచ్ అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు విచారణ చేసి, తీర్పు వెలువరించారు.
ఫిర్యాదుదారుడైన వంశీని హోటల్ సిబ్బంది పరుష పదజాలంతో దూషించడం, హోటల్ సేవల్లో జరిగిన లోపాలను గుర్తించింది. వినియోగదారుడి నుంచి అదనంగా వసూలు చేసిన రూ.5.50కి 10 శాతం వడ్డీతో అతనికి రూ.5 వేల నష్టపరిహారంతో పాటు.. 45 రోజుల్లో రూ.50 వేల జరిమానా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చెల్లించాలని ఆ బిర్యానీ హౌస్ ను ఆదేశించింది.




Tags:    

Similar News