ఎంపీ ధర్మపురి అర్వింద్ పై దాడి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జగిత్యాల జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ను

Update: 2022-07-15 11:48 GMT

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జగిత్యాల జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ను స్థానికులు అడ్డుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీ కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. గోదావరి ముంపు బాధితులకు ప్రభుత్వం గతంలో పట్టాలిచ్చిందని.. కానీ ఆ భూములను స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ బంధువులకు ఇప్పించుకున్నారని అర్వింద్ ఆరోపించారు. ఈ తప్పును ఎత్తిచూపుతానన్న భయంతోనే తనపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

ధర్మపురి అర్వింద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఎర్దండిలో జరిగిన దాడిపై అమిత్ షా ఆరా తీశారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని అమిత్ షా‌కు అర్వింద్ వివరించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ దాడులు చేస్తోందని అమిత్ షాకు చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అర్వింద్ ఎక్కడ తిరిగిన దాడులు జరపాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు ఆదేశాలను ఇచ్చిందని అర్వింద్ ఆరోపించారు. దాడి వెనక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారని అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ల నియంతృత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకే బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని సంజయ్ మండిపడ్డారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఇది ముమ్మాటికీ పిరికి పందల చర్యేనని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యవాదులంతా టీఆర్ఎస్ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు అసహ్యించుకుంటున్నా వారిలో మార్పు రాకపోవడం దారుణమని అన్నారు.


Tags:    

Similar News