IPL 2026 : ముంబయి కుప్ప కూలింది.. రాజస్థాన్ కే విజయం వరించింది

ముంబయికి వరస ఓటములు తప్పడం లేదు. రాజస్థాన్ రాయల్స్ కు విజయం వరసగా లభిస్తుంది

Update: 2026-04-08 01:58 GMT

ముంబయికి వరస ఓటములు తప్పడం లేదు. రాజస్థాన్ రాయల్స్ కు విజయం వరసగా లభిస్తుంది. మంగళవారం వర్షం కారణంగా కుదించిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు చెలరేగి ఆడటంతో 27 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 11 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 150 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 32 బంతుల్లో అజేయంగా 77 పరుగులు సాధించాడు. వైభవ్ సూర్యవంశి 39 పరుగులతో చెలరేగాడు. ఓపెనర్లు ఇద్దరూ వేగంగా 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారీ స్కోరు నమోదయింది.

ముంబయి తడబడి...
జైస్వాల్ చక్కటి టైమింగ్, శక్తివంతమైన షాట్లతో ఇన్నింగ్స్ నడిపించాడు. 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో ముంబై బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. తర్వాత రాజస్థాన్ బౌలర్లు క్రమశిక్షణగా బౌలింగ్ చేశారు. ముంబైను 123 పరుగులకు 9 వికెట్లతో పరిమితం చేశారు. ఓవర్‌కు 13 పరుగులకు పైగా అవసరమైన పరిస్థితిలో ముంబై ఛేజింగ్ లో వెనకబడింది. రియన్ రికెల్టన్ (8), రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (6) త్వరగా అవుటయ్యారు. మూడు ఓవర్లలోనే ముంబై 23 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. తిలక్ వర్మ (14), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9) కొంతసేపు నిలబడ్డారు. కానీ రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ మధ్య మధ్యలో వికెట్లు తీశారు.
పదకొండు ఓవర్లకు కుదించడంతో...
మైదానంలో కొన్ని మిస్‌ఫీల్డింగ్ లో పాటు, క్యాచ్‌లు వదిలేయడం వంటి అవకాశాన్ని షెర్ఫేన్ రదర్‌ఫోర్డ్ వినియోగించుకుని 8 బంతుల్లో 25 పరుగులు చేశాడు. కానీ సందీప్ శర్మ అద్భుతంగా ముందుకు దూకి తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్ పట్టి అతన్ని అవుట్ చేశాడు. ముందుగా మ్యాచ్ 11 ఓవర్లకు కుదించడంతో జైస్వాల్ తొలి ఓవర్లోనే దీపక్ చహర్ బౌలింగ్‌లో విరుచుకుపడ్డాడు. ఒక ఫోర్, ఒక సిక్స్‌తో పాటు మరిన్ని బౌండరీలు సాధించి ఆ ఓవర్లోనే 22 పరుగులు రాబట్టాడు. సూర్యవంశి కూడా అదే దూకుడును కొనసాగించాడు. జస్ప్రీత్ బుమ్రాను సిక్స్ బాది, తర్వాత డీప్ స్క్వేర్ లెగ్ మీద మరో భారీ షాట్ కొట్టాడు.
27 పరుగుల తేడాతో...
ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో జైస్వాల్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. పవర్‌ప్లేలో రాజస్థాన్ 3.2 ఓవర్లలోనే 59 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా ఒక ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చినా, ముంబై బౌలర్లపై రాజస్థాన్ ఓపెనర్లు ఒత్తిడి కొనసాగించారు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సూర్యవంశి రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. అయితే చివరికి తిలక్ వర్మ డీప్ ఎక్స్‌ట్రా కవర్ వద్ద క్యాచ్ పట్టడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. అల్లా ఘజన్‌ఫర్ రెండు వికెట్లు తీసి ముంబైకి కొంత ఊరట ఇచ్చాడు. ధృవ్ జురెల్ (2) ఎల్బీడబ్ల్యూ కాగా, రియాన్ పరాగ్ (20) లాంగ్ ఆన్ వద్ద క్యాచ్ అయ్యాడు. జైస్వాల్ మాత్రం తన ఆట కొనసాగిస్తూ 23 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. చివర్లో మరో బౌండరీతో జట్టును 150 పరుగుల మైలురాయికి చేర్చాడు. ఛేజింగ్ లో ముంబయి 123 పరగులుకే పరిమితమయింది. దీంతో 27 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.


Tags:    

Similar News