Ys Sharmila : వైఎస్ నుంచి పట్టుదల వచ్చిందే కాని.. పట్టువిడుపులు మాత్రం అలవర్చుకోలేదే

వైఎస్ షర్మిలకు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి నుంచి పట్టుదల వచ్చిందేమో కాని.. పట్టువిడుపులు మాత్రం అలవర్చుకోలేదు

Update: 2024-02-22 06:32 GMT

వైఎస్ షర్మిలకు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి నుంచి పట్టుదల వచ్చిందేమో కాని.. పట్టువిడుపులు మాత్రం అలవర్చుకోలేదు. అందుకే రాజకీయంగా ఆమె తప్పటడుగులు వేస్తున్నారు. ఏదో రగడ చేయడం మీడియాలో హైలెట్ కావడం తప్పించి షర్మిలకు పొలిటికల్‌గా ఎలాంటి ప్రయోజనం ఇంతవరకూ లేదన్నది వాస్తవం. అసలు షర్మిల కు రాజకీయ వ్యూహాలు ఏవైనా ఉన్నాయా? అంటి ప్చ్... అని అనడం తప్ప మరేమీ అనలేని పరిస్థితి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా తనను ప్రజలు ఆదరిస్తారన్న భ్రమలో ఆమె గడుపుతున్నారు. ఆ భ్రమతోనే రాంగ్ స్టెప్‌లు వేస్తూ ఎప్పుడూ రోడ్డుపైనే ఉండాల్సిన స్థితిని చేతులారా తెచ్చుకుంటుందని రాజశేఖర్ రెడ్డి అభిమానులే వ్యాఖ్యానిస్తున్నారు.

అసలు ఎందుకు పెట్టినట్లో?
అసలు తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన పరిస్థిితి ఎందుకు వచ్చింది. సాధ్యాసాధ్యాలను ఆలోచించారా? వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ప్రజలు పట్టం కడతారా? అది ఒకప్పుడు.. ఇప్పుడు అందరూ పాదయాత్రలు చేస్తుండటంతో దానికి విలువ లేకుండా పోయింది. కేసీఆర్ ఏం పాదయాత్ర చేశారని రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు? తెలంగాణ ప్రజలు తనను దగ్గరకు తీసుకోరని తెలిసి పార్టీని పెట్టిని చేతులు కాల్చుకున్నారు. చేతులే కాదు కాళ్లు కూడా బొబ్బలెక్కేలా పాదయాత్ర చేస్తూ పెడబొబ్బలు పెట్టారు. కేసీఆర్ ను, అప్పటి మంత్రులను వ్యక్తిగతంగా దూషణలకు దిగారు. ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకోవాలన్న తపన షర్మిలలో ఎక్కువగా కనపడుతుంది.
పార్టీని మడతపెట్టి...
తెలంగాణలో పార్టీని మడతపెట్టి కాంగ్రెస్ లో చేరిపోయారు. అదేదో ముందే కాంగ్రెస్‌లో చేరి ఉంటే కాస్త గౌరవంగా ఉండేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమైన పదవి అయినా లభించేది. ఆ పనిచేయలేదు. ఇక తాను తెలంగాణలో పెట్టిన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. ఇక ఇప్పుడు కూడా ఆమె ఊరికే ఉండటం లేదు. బలమైన ప్రతిపక్ష తెలుగుదేశానికి మించి కలరింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రోడ్ల మీద అరుస్తూ.. అరెస్టయితే ప్రజలు ఓట్లు వేస్తారని అదే భ్రమలో షర్మిల ఉన్నట్లే కనపడుతుంది. ఏపీలో కూడా ఆమె చేసే రాజకీయం చూసి తన సొంత సోదరుడుపైనే విమర్శలు చేస్తుండటంతో ప్రధాన సామాజికవర్గం ఆమెకు దూరమయింది.
జగన్ ఓడినా...
ఇంతకీ ఆమె ఏం సాధించాలని అనుకుంటుందని ఎవరైనా అడిగితే.. తెలంగాణలో కేసీఆర్ తన వల్లనే ఓడిపోయారని, ఇక్కడ తన అన్న జగన్ ను ఓడించడమే తన లక్ష్యమని చెబుతున్నారు. అంతే తప్ప ఇక్కడ ముఖ్యమంత్రి అవుతానని ధీమాగా ఆమె చెప్పలేకపోతున్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ జీరో ఓటు బ్యాంకు ఉందని తెలుసు. కానీ అన్నతో అమీతుమీ తేల్చుకునేందుకు మాత్రమే షర్మిల ప్రయత్నిస్తున్నట్లుంది. కాంగ్రెస్ పార్టీ ఏపీలో కోలుకోవడం అంటే ఇప్పట్లో జరిగే పని కాదు. ఒకవేళ జగన్ ఓడినా కాంగ్రెస్ అధికారంలోకి రాదు. టీడీపీ, జనసేన కూటమి పవర్ లోకి వస్తుంది. మరి షర్మిల ఏం సాధించినట్లు అన్నను ఓడించానన్న తృప్తితో హైదరాబాద్ వెళ్లిపోతారా? లేక పార్టీని తాను బలోపేతం చేయలేకపోయానని చెప్పి ఇంటికే పరిమితమవుతారా? లేదంటే .. చంద్రబాబు సీఎం అయితే సంబరపడతారా? అంటూ సోషల్ మీడియాలో ఎదురవుతున్న ప్రశ్నలకు ఆమె వద్ద సమాధానం మాత్రం లేదు.


Tags:    

Similar News