నెల్లూరు అభ్యర్థిని ప్రకటించిన టిడిపి అధిష్టానం

ఇటీవలే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీలో తమపై పోటీ చేయాలని సవాల్ చేయడం..

Update: 2023-06-30 05:14 GMT

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సుమారు 10 నెలల సమయం ఉంది. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలపై కసరత్తులు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తే.. విజయం సాధిస్తామో.. లెక్కలన్నీ బేరీజు వేసుకుని ఒక్కొక్క అభ్యర్థిని ప్రకటిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటి నుంచే ప్రజలకు దగ్గరయ్యేందుకు సన్నాహాలు మొదలుపెట్టేశాయి. ప్రస్తుతం నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు.. నెల్లూరు రాజకీయాలను హీటెక్కించాయి.

ఇటీవలే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీలో తమపై పోటీ చేయాలని సవాల్ చేయడం, ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ ప్రతిసవాళ్లు విసరడం.. ఇలా వారంరోజులుగా రాజకీయాలు హీటెక్కాయి. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం నెల్లూరు అభ్యర్థిని ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఖరారు చేసింది. గత ఎన్నికల్లోనూ.. అనిల్ - నారాయణ ల మధ్యే పోటీ జరిగింది. అప్పుడు అనిల్ గెలిచారు. మరి 2024లోనూ ఈ ఇద్దరే బరిలోకి దిగుతుండటంతో.. పోటీ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. తనపై పోటీ చేయాలని అనిల్ .. ఆనం రాంనారాయణకు సవాల్ చేసిన నేపథ్యంలో.. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడినుంచైన పోటీకి రెడీ అంటూ అనిల్ కు కౌంటర్‌ ఇచ్చారు.


 


Tags:    

Similar News