Ys Jagan : టాలీవుడ్ నిర్మాత‌కు వైసీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌..?

టాలీవుడ్ నిర్మాతకు జగన్ టిక్కెట్ కన్ఫర్మ్ చేశారన్న ప్రచారం వైసీపీలో జరుగుతుంది

Update: 2024-02-21 13:25 GMT

ఎస్... ఇప్పుడు ఇదే వార్త గుంటూరు జిల్లా వైసీపీ వ‌ర్గాల్లో మాంచి కాక రేపుతోంది. టాలీవుడ్‌ను జ‌గ‌న్ పెద్దగా ప‌ట్టించుకోని ప‌రిస్థితి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ముఖ్యమంత్రి అయ్యాక కొంద‌రు మాత్రమే జ‌గ‌న్‌కు స‌పోర్ట్ చేయ‌గా.. చాలా మంది దూరంగా ఉన్నారు. ఆ త‌ర్వాత ఏపీలో సినిమాల టిక్కెట్ రేట్ల త‌గ్గుద‌ల‌, ఇత‌ర‌త్రా విష‌యాల‌పై చ‌ర్చించేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలే అమ‌రావ‌తికి త‌ర‌లి వ‌చ్చి జ‌గ‌న్‌తో చ‌ర్చించారు. ఇదంతా గ‌తం.. క‌ట్ చేస్తే ఇప్పుడు జ‌గ‌న్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న ఓ టాలీవుడ్ యువ నిర్మాత‌కు గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చే అంశంపై వైసీపీ పెద్దల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

ఖరీదైన బహుమతి...
ఆ నిర్మాత ఎవ‌రో కాదు దాస‌రి కిర‌ణ్‌కుమార్‌. దాస‌రి కిర‌ణ్‌కుమార్ వైసీపీ ప్రతిప‌క్షంలో ఉన్నప్పటి నుంచే జ‌గ‌న్‌కు మంచి స‌పోర్ట్ గా ఉంటూ వ‌స్తున్నారు. జ‌గ‌న్ ముఖ్యమంత్రి అయ్యాక దాసరి కిర‌ణ్‌కు టీటీడీ బోర్డు మెంబ‌ర్‌గా అవ‌కాశం ఇచ్చారు. గ‌తంలో రాంగోపాల్ వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో జ‌గ‌న్‌కు పాజిటివ్‌గా, ప్రతిప‌క్షాల‌ను టార్గెట్ చేస్తూ తీసిన సినిమాల‌కు ఆయ‌నే నిర్మాత‌. ఇప్పుడు వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన జ‌గ‌న్ బ‌యోపిక్ వ్యూహం, శ‌ప‌థం సినిమాల‌ను కూడా కిర‌ణ్‌కుమార్ సొంత బ్యాన‌ర్ మీద నిర్మించారు. 2019 ఎన్నిక‌ల్లోనే దాస‌రి కిర‌ణ్‌కుమార్ గుంటూరు జిల్లాలోని పొన్నూరు లేదా తెనాలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక సీటు నుంచి పోటీ చేయాల‌ని ఆశ‌ప‌డ్డారు. అప్పుడు జ‌గ‌న్ ఒప్పుకోలేదు.
సోషల్ ఇంజినీరింగ్ నేపథ్యంలో...
అయితే ఇక ఇప్పుడు మారుతున్న స‌మీక‌ర‌ణ‌లు, జ‌గ‌న్ సోష‌ల్ ఇంజ‌నీరింగ్ నేప‌థ్యంలో కిర‌ణ్‌ను తెనాలి నుంచి పోటీ చేయించాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి తిరిగి వైసీపీలోకి వ‌చ్చారు. అయితే రీసెంట్‌గా గుంటూరు పార్లమెంటు స‌మ‌న్వయ‌క‌ర్తగా సీనియ‌ర్ నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లు పెద్ద కుమారుడు ఉమ్మారెడ్డి వెంక‌ట‌ర‌మ‌ణ‌ను నియ‌మించారు. ఇప్పుడు ఆళ్ల రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆయ‌న్ను గుంటూరు పార్లమెంటు నుంచి పోటీ చేయించాల‌ని జ‌గ‌న్ ప్లాన్‌గా తెలుస్తోంది.
అందుకే ఆయనను...
ఈ క్రమంలోనే దాసరి కిర‌ణ్‌ను తెనాలి అసెంబ్లీ నుంచి పోటీ చేయిస్తార‌ని స‌మాచారం. తెనాలిలో ప్రస్తుతం అన్నాబత్తిన శివకుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులను ఓడించారు. ఈసారి తెనాలి సీటు నాదెండ్ల మనోహర్ కు జనసేన నుంచి ఖరారయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఇక్కడ ఉన్న శివకుమార్ స్థానంలో దాసరి కిరణ్ కుమార్ కు ఇస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. గుంటూరు పార్లమెంటు స‌మ‌న్వయ‌క‌ర్తగా కాపు వ‌ర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంక‌ట‌ర‌మ‌ణ‌ను త‌ప్పించి ఆ కాపు ఈక్వేష‌న్‌ను తెనాలిలో దాస‌రి కిర‌ణ్‌ను రంగంలోకి దించ‌డం ద్వారా స‌రి చేయాల‌ని భావిస్తున్నట్టు స‌మాచారం.
Tags:    

Similar News