ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన స్టార్ సెలబ్రిటీలు.. సబ్ స్క్రిప్షన్ తీసుకున్న రాలేదంటూ ట్వీట్లు

గతంలో ఏ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులైనా సరే.. తమ అకౌంట్ ను ఉచితంగా వెరిఫై చేసుకుని బ్లూ టిక్ పెట్టుకునే అవకాశం..

Update: 2023-04-21 05:13 GMT

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ లెగసీ వెరిఫైడ్ అకౌంట్లపై బ్లూ టిక్ లను తొలగించారు. ఈ విషయంలో మస్క్ మామ ఎవరినీ వదల్లేదు. ఏపీ సీఎం జగన్ మొదలు.. సినీ సెలబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు. గతంలో ఏ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులైనా సరే.. తమ అకౌంట్ ను ఉచితంగా వెరిఫై చేసుకుని బ్లూ టిక్ పెట్టుకునే అవకాశం ఉండేది. కానీ.. మస్క్ చేతికి ట్విట్టర్ పగ్గాలు వచ్చాక.. వెరిఫైడ్ టిక్ లకు ఫీజు చెల్లించాలన్న కండీషన్ ను తీసుకొచ్చారు. బ్లూటిక్ కావాలనుకునే వాళ్లు వెబ్ ద్వారా అయితే నెలకు 8 అమెరికన్ డాలర్లు... ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్ ద్వా పే చేస్తే నెలకు 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు మస్క్ ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాడు.

ఈ క్రమంలో నిర్ధారిత ఫీజులను చెల్లించని ఖతాలకు ట్విట్టర్ బ్లూ టిక్ ను తొలగించింది. బ్లూ టిక్ ను కోల్పోయిన వారిలో.. ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, నటులు చిరంజీవి, షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్ తదితరుల ఖాతాలకు ట్విట్టర్ బ్లూటిక్ ను తొలగించింది. ప్రముఖ వ్యాపార వేత్తల ఖాతాలకు కూడా ట్విట్టర్ బ్లూ టిక్ ను తొలగించింది. అయితే కొందరు సెలబ్రిటీలు ట్విట్టర్ నా బ్లూటిక్ ను తొలగించింది అని అఫీషియల్ గా ట్వీట్లు చేశారు. నటి ఖుష్బూ తాను ట్విట్టర్ బ్లూ టిక్ కోసం పేమెంట్ చేసినా ఇంకా బ్లూ టిక్ యాక్టివేట్ కాలేదని.. ఇలా ఎందుకు అవుతుందో తెలియట్లేదని ట్వీట్లో పేర్కొన్నారు. రాత్రికి రాత్రే బ్లూ టిక్ ను తొలగించడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.
ఈ రోజు నుండి ట్విట్టర్ బ్లూ టిక్ కు సబ్ స్క్రైబ్ చేసుకోని వారి బ్లూటిక్ లను తొలగిస్తామని ట్విట్టర్ నిన్నే అఫీషియల్ గా చెప్పింది. తొలుత మార్చి 1 నుండే ఈ విధానాన్ని అమలు చేస్తామన్న ట్విట్టర్.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల చేయలేకపోయింది. 2009లో ట్విట్టర్ బ్లూ టిక్ సిస్టంను ప్రవేశపెట్టింది. ఈ బ్లూ టిక్ ఉన్న సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సంస్థల ఖాతాలు ఒరిజినల్ అని లెక్క. ఇతరులు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసినా.. అవి ఒరిజినల్ అకౌంట్లు కావని యూజర్లకు అర్థమయ్యేందుకు బ్లూ టిక్ విధానాన్ని ట్విట్టర్ ప్రవేశ పెట్టింది.


Tags:    

Similar News