ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ.. దేశ రాజకీయాల్లో హీట్ పెంచిన ట్వీట్
2024 సార్వత్రిక ఎన్నికలపై పని చేసే కమిటీలో సభ్యునిగా రావడానికి కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించిన వారం తర్వాత..
న్యూఢిల్లీ : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సోమవారం నాడు ఒక సంచలన ట్వీట్ చేశారు. ఇటీవలే కాంగ్రెస్తో ఆయన కలుస్తారనే ప్రచారం సాగగా.. అది కార్యరూపం దాల్చలేదు. ఆయన తదుపరి ప్రణాళిక ఏమిటో కూడా క్లారిటీ లేని సమయంలో.. ఆయనే సొంతంగా పార్టీ పెడతాడనే ప్రచారం కూడా సాగింది.
ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పదేళ్లుగా తాను ప్రజల పక్షాన విధానాలు రూపొందించానని, అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవాల్సి ఉందని, ప్రజలకు చేరువ కావాల్సిన అవసరం వచ్చిందని ఆయన అన్నారు. సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నానని, బీహార్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పారు.
2024 సార్వత్రిక ఎన్నికలపై పని చేసే కమిటీలో సభ్యునిగా రావడానికి కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించిన వారం తర్వాత ప్రశాంత్ కిశోర్ నుండి ఈ ప్రకటన వచ్చింది. ప్రశాంత్ కిశోర్ రాష్ట్రంలో పర్యటించాలని ప్లాన్ చేసుకున్నారని, అధికార బీజేపీ -జనతాదళ్ యునైటెడ్ ఫ్రంట్కు వ్యతిరేకంగా తన కార్యాచరణ ప్లాన్ చేస్తున్నాడు. తన పర్యటనల సమయంలో కిశోర్ ఓటర్లతో సమావేశాలు నిర్వహించనున్నారు.