Bengaluru : బెంగళూరు రోడ్లు ఇక తళతళ.. ఎఫెక్ట్ మామూలుగా పడలేదుగా?
బెంగళూరు మహానగరంలో ఇక రహదారులు బాగుపడనున్నాయి. ఛిద్రమైన రహదారులకు మరమ్మతులు చేయనున్నారు.
బెంగళూరు మహానగరంలో ఇక రహదారులు బాగుపడనున్నాయి. ఛిద్రమైన రహదారులకు మరమ్మతులు చేయనున్నారు. ఇటీవల తరచూ కురుస్తున్న భారీ వర్షాలకు బెంగళూరు నగరం రహదారులు గుంతలమయంగా మారాయి. దీంతో బెంగళూరు నగర ప్రజలు మాత్రమే కాకుండా టెక్ కంపెనీలు కూడా రహదారులు అద్వాన్న స్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గుంతలమయమైన రహదారుల్లో ప్రయాణం నరకంగా మారిందని చెబుతున్నారు. ఒక్క కిలోమీటర్ ప్రయాణించాలంటే గంట సమయం పడుతుందని వాపోతున్నారు.
బెంగళూరు నుంచి వెళ్లిపోతామంటూ...
దీనికితోడు ఇటీవల బ్లాక్బక్ సీఈఓ రాజేష్ యాబాజీ ఔటర్ రింగ్ రోడ్ లో గుంతలతో రోడ్లు దెబ్బతిన్న కారణంగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నట్టు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. తమ కంపెనీ ఉద్యోగులు ఆఫీసుకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీంతో తాము ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రి నారా లోకేశ్ కంపెనీ సీఈవో రాజేష్ ను తమ రాష్ట్రంలోని విశాఖకు రాాలని కోరారు. ఇక్కడ అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
750 కోట్లను కేటాయిస్తూ...
అయితే అదే రోజు పీన్యా ఇండస్ట్రీస్ అసోసియేషన్ కూడా రోడ్ల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న పొరుగు రాష్ట్రాలకు కంపెనీలు వెళ్లిపోవచ్చని డి.కె.శివకుమార్కు ఆ సంఘం తెలిపింది. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించార. ఒక నెలలో బెంగళూరులలోని రహదారులు బాగు చేయాలని గడువు విధించారు. ఇందుకోసం 750 కోట్ల రూపాయలను కేటాయించారు. డువు పాటించకపోతే చీఫ్ ఇంజినీర్లపై చర్యలు తప్పవని సిద్ధరామయ్య హెచ్చరించారు. పనుల్లో నాణ్యతపై రాజీపడకూడదని కూడా సిద్ధరామయ్య తెలిపారు.