జెట్ ఎయిర్ వేస్ నరేష్ గోయల్ అరెస్ట్

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు అరెస్టు చేశారు

Update: 2023-09-02 01:44 GMT

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు అరెస్టు చేశారు. కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో ముంబైలోని ఈడీ ఆఫీస్‌లో ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం పీఎంఎల్ఏ (PMLA) కోర్టులో హాజరుపరుచనున్నారు. కెనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసం చేసినట్లు సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నారు. మే 5న ముంబైలోని ఏడు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంటూ నరేశ్ గోయల్, అనితా గోయల్, గౌరంగ్ ఆనంద శెట్టి తదితరులపై గతేడాది నవంబర్ 11న సీబీఐకి కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ పీ సంతోష్ ఫిర్యాదు చేశారు. దీనివల్ల బ్యాంకుకు రూ.538.62 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

దాదాపు 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా విమాన సేవలు నిర్వహించింది జెట్ ఎయిర్‌వేస్. అయితే భారీ నష్టాలు, సర్వీసుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో విఫలం కావడంతో 2019 ఏప్రిల్‌లో మూత పడింది. బ్యాంకులు నిర్వహించిన వేలంలో జలాన్ కల్రాక్ కన్సార్టియం, జెట్ ఎయిర్వేస్ సంస్థ బిడ్ ను సొంతం చేసుకుంనది. జెట్ ఎయిర్వేస్ సర్వీస్‌లు నిలిచిపోయాక.. 2019 మే 25న విదేశాలకు వెళ్లేందుకు నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ ప్రయత్నించారు. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించారు.
విదేశీ విమాన సర్వీసుల సంస్థ ‘ఎతిహాద్’కు వాటాల విక్రయ ఒప్పందం విషయంలో విదేశీ మారక ద్రవ్యం యాజమాన్య సంస్థ (ఫెమా) నిబంధనలను నరేష్ గోయల్ ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో ముంబై, ఢిల్లీల్లోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై 2019 సెప్టెంబర్ లో తనిఖీలు చేశారు. 2020లో నరేశ్ గోయల్‌ని ఈడీ అధికారులు పలు దఫాలు ప్రశ్నించారు. తాజాగా ఆయన అరెస్టుకు దారితీసింది.


Tags:    

Similar News