జూన్ లో భారీగా జీఎస్టీ వసూళ్లు.. గతేడాది కంటే 12 శాతం అధికం

2021-22 త్రైమాసికంలో జీఎస్టీ సగటు వసూళ్లు రూ.1.10 లక్షల కోట్లు ఉండగా.. 2022-23 తొలి త్రైమాసికం వసూళ్లు రూ.1.51 లక్షల..

Update: 2023-07-01 13:13 GMT

india gst collections

ఈ ఏడాది జూన్ నెలలో భారీగా వస్తు, సేవల పన్నులు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడాది జూన్ కంటే.. ఈసారి 12 శాతం అధికంగా జీఎస్టీ వసూలైనట్లు తెలిపింది. జూన్ నెలకు గానూ ఏకంగా రూ.1,61,497 కోట్లు వసూలు అయ్యాయని వివరించింది. వీటిలో సీజీఎస్టీ రూపంలో రూ.31,013 కోట్లు, ఎస్ జీఎస్టీ రూపంలో రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.80,292 కోట్లు వసూలైనట్లు తెలిపింది. గతేడాది జూన్ లో రూ.1.44 లక్షల కోట్ల వసూళ్లు రాగా.. ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరిగి రూ.1.61 లక్షల కోట్లు వచ్చాయి. దేశంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కు దాటడం ఇది నాల్గవసారి.

2021-22 త్రైమాసికంలో జీఎస్టీ సగటు వసూళ్లు రూ.1.10 లక్షల కోట్లు ఉండగా.. 2022-23 తొలి త్రైమాసికం వసూళ్లు రూ.1.51 లక్షల కోట్లకు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం వసూళ్లు రూ.1.61 లక్షల కోట్లకు పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో రూ.4,681.39 కోట్లు, ఏపీలో రూ.2,986.52 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే.. ఈఏడాది 20 శాతం మేర పెరిగాయి. గతేడాది రూ.3,901.45 కోట్ల జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. ఇక అత్యధికంగా జీఎస్టీ వసూలైన రాష్ట్రాల్లో ఎప్పటిలాగే మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మహారాష్ట్ర రూ.26,098.78 కోట్లు జీఎస్టీ వసూళ్లు చేసింది.


Tags:    

Similar News