త్వరలో మన దేశం పేరును మార్చనున్నారా..?

దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పలు ప్రాంతాలు, వివిధ స్మారక నిర్మాణాలు, నగరాల పేర్లను మార్చడం ప్రారంభించింది..

Update: 2023-09-06 03:42 GMT

దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పలు ప్రాంతాలు, వివిధ స్మారక నిర్మాణాలు, నగరాల పేర్లను మార్చడం ప్రారంభించింది. అయితే ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో పట్టణాల పేర్లు సైతం మారిపోయాయి. ఇప్పటి వరరకు 40 పట్టణాల పేర్లు, యూనివర్సిటీల పేర్లను మార్చింది బీజేపీ ప్రభుత్వం. మరి ఏ నగరాల పేర్లు మారాయో తెలుసుకుందాం.

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరరకు చాలా నగరాలు, ప్రదేశాలు, ప్రాంతాల పేర్లను మార్పు జరిగింది. అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా,గుర్గావ్‌ పట్టణాన్ని గురుగ్రరామ్‌, ఫైజాబాద్‌ జిల్లా పేరును అయోధ్య జిల్లాగా మార్చారు. అలా ఒకటేమిటి చాలా నగరాలు, చారిత్రత్మ ప్రదేశాలు, ఇతర ప్రాంతాల పేర్లను మార్చింది బీజేపీ ప్రభుత్వం. ఓవైపు ఈ నగరాల పేర్ల మార్పు వ్యవహారం కొనసాగుతుండగానే మరోవైపు ఏకంగా దేశం పేరు మార్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటి నుంచో చెబుతున్నట్లుగా ఈ వలసవాద చిహ్నలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఇండియా పేరుకు కూడా చరమగీతం పాడాలనే కేంద్రం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ విషయంలో ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నాయి కూడా. అయితే ఈ పేరు మార్పు ప్రతిపాదనను పార్లమెంట్ సమావేశాల ముందుంచే అవకాశం కనిపిస్తోంది.

కాగా, ఇటీవల బీజేపీ ఎంపీ హర్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. తక్షణమే భారత రాజ్యాంగం నుంచి ఇండియా అన్న పదాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 'ఇండియా అనే పదాన్ని ఆంగ్లేయులు ఉపయోగించేవారన్న ఆయన.. ఇండియా అనే పదానికి బదులు భారత్ అనే పేరును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. పేరు మార్పుపై రాజ్యాంగ సవరణ చేయాలని బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఇండియా అనే పదం బ్రిటిషర్లు తీసుకొచ్చారని... భారత్ అనే పదం మన సంస్కృతికి ప్రతీక అని గుర్తు చేశారు.

ఏయే పేర్లు మారాయంటే..

➦ అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా

➦ గుర్గావ్‌ను గురుగ్రామ్‌గా

➦ ఫైజాబాద్‌ జిల్లాను అయోధ్య జిల్లాగా మార్పు

➦ మొఘల్‌ గార్డెన్‌ను అమృత్‌ ఉద్యాన్‌గా

➦ రాజ్‌పథ్‌- కర్తవ్యపథ్‌గా

➦ ఫిరోజ్‌ షా కోట్ల స్టేడియం ఆరుణ్‌ జైట్లీ స్టేడియంగా

➦ మొఘల్‌ సరాయ్‌ జంక్షన్‌- దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్‌ జంక్షన్‌గా

➦ నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ పేరును ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

దేశంలో పలు నగరాల పేర్లు మారుస్తూ బీజేపీ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇటీవల బీజేపీ- కాంగ్రెస్ మధ్య దుమారం రేపింది. ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ పేరును.. మోదీ ప్రభుత్వం మార్చడం వల్ల కాంగ్రెస్ కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలో జవహర్‌లాల్‌ నెహ్రూ అధికారిక నివాసంగా ఉన్న తీన్‌మూర్తి భవన్‌ చుట్టూ గతంలో రగడ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ భవనంలో ఉన్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ పేరును.. ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దేశ రాజకీయాల్లో తీవ్రర దుమారం రేపింది. త్వరలోనే లక్నో పేరును కూడా లక్ష్మణ నగరిగా మార్చనున్నట్లు సమాచారం.

యూపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని పలు నగరాల పేర్లు మార్చేశారు. గతంలో కర్నాటకలోనూ బీజేపీ ప్రభుత్వం అదే చేసింది. మహారాష్ట్రలో సైతం కొన్ని నగరాల పేర్లు మారాయి. ఇక తెలంగాణలో కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చాకా పలు నగరాల, ప్రాంతాల పేర్లు మారుస్తామని చెబుతోంది బీజేపీ. ఇలా పట్టణాలు, నగరాలకే పరిమితమైన పేర్ల ఏకంగా దేశం పేరు మార్పు వరకు వచ్చింది. వలసవాద గుర్తులను తొలగించాలని ప్రధాని నరేంద్రమోదీ అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే.. 75 ఏళ్లుగా ఇండియాగా పిలవబడుతున్న మన దేశానికి ఒకే పేరు శాశ్వతంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు జీ–20 సదస్సే సరైన సమయంగా భావించింది. ఈ సదస్సుకు తరలివస్తున్న ప్రపంచదేశాధినేతలకు ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ పేరుతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందుకు ఆహ్వానం పంపారు. 

Tags:    

Similar News