ఒడిశాలో మరో రైలు ప్రమాదం

ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు..

Update: 2023-06-05 06:06 GMT

goods train derailed

ఒడిశాలో మరో రైలు ప్రమాదానికి గురైంది. బారాఘడ్ జిల్లాలో సంబర్ ధార వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు పట్టాలు తప్పడంతో ఐదు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. పట్టాలు తప్పి పక్కకు ఒరిగిన బోగీలను తిరిగి రైలుకు అటాచ్ చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ గూడ్స్ రైలు బర్గఢ్ నుంచి దుంగ్రీ ప్రాంతానికి సున్నపురాయి లోడ్ తో వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఏసీసీ సిమెంట్ కర్మాగారంలో సున్నపురాయి గనుల నుంచి ప్లాంట్ కు లోడ్ తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది.

కాగా.. జూన్ 2, శుక్రవారం రాత్రి కోరమాండల్ ఎక్స్ ప్రెస్.. లూప్ లైన్ లో ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టగా.. కాసేపటికీ అదే లైన్ మీదుగా వచ్చిన యశ్వంత్ పూర్ ట్రైన్ కూడా ప్రమాదానికి గురైంది. మూడు రైళ్ల ప్రమాదంలో సుమారు 300 మంది మృతి చెందగా.. 1100 మంది గాయపడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాయి. ఇంకా వందల మృతదేహాలను గుర్తించలేదు. మృతదేహాలు నుజ్జవ్వడంతో గుర్తించడం కష్టతరంగా మారింది. ప్రమాదం జరిగి నాలుగు రోజులు అవుతుండటంతో మృతదేహాలు కూడా కుళ్లిన దశకు చేరుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా.. మూడు రైళ్లలో సుమారు 40 మంది వరకూ రైల్వే సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల సమాచారంపైనే దృష్టి పెట్టడంతో సిబ్బంది విషయం ఎవరూ గ్రహించలేదు. వారంతా ఏమయ్యారు ? మృతుల్లో సిబ్బంది కూడా ఉన్నారా ? లేక ప్రమాదం విషయం బయటకు వస్తుందని సిబ్బంది తప్పుకున్నారా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి.


Tags:    

Similar News