8 నెలలుగా లో దుస్తులు మాయం.. తీరా చూస్తే పొరిగింటి వ్యక్తే వాటిని తీసుకెళ్లి..

పచ్చామ్ గ్రామానికి చెందిన ఓ 30 ఏళ్ల మహిళ.. తన పొరుగింటి వ్యక్తి తన లో దుస్తులు చోరీ చేస్తున్నాడని జూన్ 27న ఆరోపించింది.

Update: 2023-07-01 15:03 GMT

man thiefs woman undergarments

సుమారు ఎనిమిది నెలలుగా ఓ మహిళ లో దుస్తులు మాయమవుతున్నాయి. పెరట్లో ఆరేసిన దుస్తుల్లో లో దుస్తులు మాత్రమే మాయమవ్వడంతో సదరు మహిళ అయోమయానికి గురైంది. ఎవరు తీస్తున్నారో తెలియక సతమతమైంది. ఓ రోజున ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకునేందుకు పెరట్లో రహస్యంగా ఫోన్ ను పెట్టి.. వీడియో రికార్డ్ చేసింది. అందులో పొరుగింటి వ్యక్తి కనిపించడంతో ఆమె నిర్ఘాంత పోయింది. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలో ఉన్న ఓ గ్రామంలో వెలుగుచూసింది. మహిళ లో దుస్తుల చోరీ విషయం.. గ్రామంలో రెండు వర్గాల మధ్య కొట్లాటలకు దారితీయగా.. పోలీసులు 20 మందిని అరెస్ట్ చేశారు.

పచ్చామ్ గ్రామానికి చెందిన ఓ 30 ఏళ్ల మహిళ.. తన పొరుగింటి వ్యక్తి తన లో దుస్తులు చోరీ చేస్తున్నాడని జూన్ 27న ఆరోపించింది. 8 నెలలుగా తన లో దుస్తులు మాయమవుతున్నాయని, అతడిని పట్టుకునేందుకు ఫోన్ ను అమర్చగా.. అతను చేస్తున్న తతంగం బయటపడిందని తెలిపింది. పక్కింట్లో ఉన్న వ్యక్తే తన లో దుస్తులు చోరీ చేస్తున్నాడని గుర్తించింది. ఆ తర్వాత రోజు అతడు ఎప్పట్లాగే లో దుస్తులు చోరీ చేసి వెళుతుండగా, అతడిని ఆ మహిళ అనుసరించింది. అతని ఇంట్లో తన లో దుస్తులన్నింటినీ గుర్తించిన ఆమె.. అతనితో వాగ్వాదానికి దిగింది. ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించగా.. తన బండారం బయటపెట్టిందన్న ఆగ్రహంతో ఆ వ్యక్తి మహిళపై దాడి చేశాడు.
మహిళ గట్టిగా అరవడంతో ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లగా.. సదరు వ్యక్తికి మద్దతుగా అతని బంధువులు కూడా వచ్చారు. మహిళ లో దుస్తుల చోరీ గొడవ కాస్తా.. గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు.. మహిళ, ఆమె బంధువులపై.. లో దుస్తుల్ని దొంగిలించిన పొరిగింటి వ్యక్తి, అతని బంధువులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో కొట్టుకున్న 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.


Tags:    

Similar News