రాజకీయ విరాళాలలో కమలానిదే పై చేయి.. ఏడీఆర్ రిపోర్టు ఏం చెబుతుందంటే?

రాజకీయ విరాళాలు దేశంలో బీజేపీకి అత్యధికంగా వచ్చాయి

Update: 2026-02-14 04:41 GMT

రాజకీయ విరాళాలు దేశంలో బీజేపీకి అత్యధికంగా వచ్చాయి. బీజేపీకి 3,157 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్‌కు 298 కోట్లు వచ్చాయి.2024-25లో ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా బీజేపీకి భారీగా విరాళాలు అందాయి. మొత్తం నిధుల్లో 82.52 శాతం వాటాతో బీజేపీదే అగ్రస్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌కు 7.81 శాతం, తృణమూల్‌కు 2.67 శాతం మాత్రమే నిధులు దక్కాయి. విరాళాలు అందించిన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఏడీఆర్ తాజా నివేదిక ప్రకారం2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో అధికార భారతీయ జనతా పార్టీ అధిక భాగం దక్కించుకుంది. మొత్తం నిధుల్లో ఏకంగా 82.52 శాతం వాటాను కమలం పార్టీయే పొందగా, మిగిలిన పార్టీలు చాలా వెనుకబడ్డాయి.

ఏడీఆర్ నివేదిక మేరకు...
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన తాజా నివేదిక ఈ సంచలన వివరాలను వెల్లడించింది.ఏడీఆర్ నివేదిక ప్రకారం 2024-25లో ఎలక్టోరల్ ట్రస్టులు వివిధ రాజకీయ పార్టీలకు కలిపి మొత్తం రూ. 3,826.35 కోట్లను పంపిణీ చేశాయి. ఇందులో బీజేపీ ఒక్కదానికే రూ. 3,157.65 కోట్లు అందాయి. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి కేవలం రూ. 298.78 కోట్లు (7.81 శాతం), తృణమూల్ కాంగ్రెస్‌కు రూ. 102 కోట్లు (2.67 శాతం) మాత్రమే లభించాయి. మిగిలిన 19 పార్టీలకు కలిపి రూ. 267.92 కోట్లు అందాయి. విరాళాలు అందించిన కార్పొరేట్ సంస్థల్లో ఎలివేటెడ్ అవెన్యూ రియాల్టీ ఎల్ఎల్‌పీ రూ. 500 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
ఐదు ట్రస్టులకు చెందిన...
ఆ తర్వాత టాటా సన్స్ 308 కోట్లు, టీసీఎస్ 217 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ 175 కోట్లు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర నుంచి అత్యధికంగా రూ. 1,225 కోట్లు రాగా, తెలంగాణ నుంచి రూ. 358 కోట్లు అందడం గమనార్హం. దేశంలో మొత్తం 20 రిజిస్టర్డ్ ఎలక్టోరల్ ట్రస్టులు ఉండగా, కేవలం 10 ట్రస్టులు మాత్రమే తమ విరాళాల వివరాలను సమర్పించాయి. ఇంకో 5 ట్రస్టులు తమకు విరాళాలే రాలేదని తెలిపాయి. మరో ఐదు ట్రస్టుల నివేదికల గడువు ముగిసినా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవని ఏడీఆర్ తన విశ్లేషణలో పేర్కొంది. ఈ లెక్కలు కూడా బయటకు వస్తే విరాళాల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. బీజేపీ పదకొండేళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి ఎక్కువ మంది విరాళాలు అందించేందుకు మొగ్గు చూపారు.


Tags:    

Similar News