రంగస్థలంపై రాజుకున్న అగ్గి

Update: 2018-03-15 09:18 GMT

ఈమధ్యన సినిమాలు ఏమైనా విడుదలవుతున్నాయి అంటేనే ఆ సినిమాపై ఏదో ఒక విషయమై ఏదో ఒక కులం వారు రచ్చ చెయ్యడం అనేది పరిపాటిగా మారిపోయింది. ఒక సినిమా అని, ఒక హీరో సినిమా అని కాదు ఏ సినిమా అయినా తమ కులాన్ని కించపరిచే విధంగా చిన్న పదం గాని, చిన్న సీన్ గాని ఆ సినిమాలో కనిపించిందా ఇక ఆ సినిమా విడుదలయ్యేసరికి ఆ సినిమాపై రచ్చ చెయ్యడం... ఆ సినిమాలోని ఆ సీన్స్ ని కట్ చేసే వరకు నిదర పోకుండా నిరసనలు చెయ్యడం అనేది ఈమధ్యన పరిపాటిగా మారాయి. కొన్ని సార్లు ఈ రచ్చ వలన సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంటే మరికొన్నిసార్లు ఆయా సినిమాల దర్శకనిర్మాతలకు చెమట్లు పడుతున్నాయి.

మొన్నటికి మొన్న డీజే సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని బ్రాహ్మణ సంఘాల వాళ్ళు నానా రచ్చ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ రచ్చ రామ్ చరణ్ రంగస్థలంపై స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు ప్రమోషన్స్ మొదలెట్టి నెలలు గడుస్తున్న ఎటువంటి హడావిడి చెయ్యని వారు... ఈ రోజు పాటలు మొత్తం విడుదలవడం పాపం యాగీ చెయ్యడానికి ఒక కులం వారు రెడీ అయ్యారు. అయితే గతంలోనే విడుదలయిన రంగస్థలంలోని మూడు పాటలు మార్కెట్ లో హడావిడి చేస్తున్నాయి. అందులో రంగమ్మ.. మంగమ్మ అనే పాట అయితే జనాలకు బాగా ఎక్కేసింది. ఎవరి నోట విన్నా, ఎవరి ఫోన్ రింగ్ టోన్ విన్నా, ఇక కార్ల లోని సిడీలలో కూడా ఈ రంగమ్మ మంగమ్మ పాట అదిరిపోయే లెవల్లోమార్మోగిపోవడమే కాదు...యూట్యూబ్ లో ఈ పాట పది మిలియన్ల వ్యూస్ సాధించే దిశగా పరుగులు పెడుతుంది.

అలాంటి పాటలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయంటూ అఖిల భారత యాదవ సంఘం మండి పడుతుంది. ఆ పాట చరణంలో... గొల్లభామ వచ్చి గోళ్ళు గిల్లుతుంటే అనే పదాలు తమ జాతి ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయని యాదవ సంఘం ప్రెసిడెంట్ రాములు యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆ పాటలోని ఆ పదాలను వెంటనే తొలగించకపోతే ఆందోళన చేస్తామని కూడా యాదవ సంగం వారు హెచ్చరించారు. దీని గురించి రంగస్థలం టీం ఇంకా స్పందించలేదు కాని ఇప్పుడు ఈ రంగస్థలం పాటపై యాదవ సంగాల హెచ్చరికలు మాత్రం వైరల్ అయ్యాయి.

Similar News