ఈసారి ఎంతటి పవర్ ఫుల్ టైటిల్ పెడతాడో!!

Update: 2017-07-19 13:00 GMT

వివి వినాయక్‌ మొదటినుండి టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గానే ఎదిగాడు. వినాయక్ కి ఆ మాస్ సినిమాలే మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఎప్పుడు వినాయక్ తన సినిమా టైటిల్స్ కి 'లక్ష్మీ, ఆది, బన్నీ,దిల్‌' ఇలా రెండక్షరాల పేర్లను బాగా లైక్‌ చేస్తుంటాడు. ఇక ఆయన మెగాస్టార్‌ నటించిన ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రంగా 'ఖైదీనెంబర్‌ 150' చేశాడు. ఇది విడుదలై ఆరునెలలు దాటినా ఆయన ఇంకా మరో ప్రాజెక్ట్‌ మొదలుపెట్టలేదు. ఆ సినిమాకి పనిచేసిన వారంతా వేరే సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ ఒక్క వినాయక్‌ మాత్రమే ప్రస్తుతం ఎటువంటి సినిమాని డైరెక్ట్ చెయ్యకుండా ఖాళీగా ఉన్నాడు.

అయితే ఖైదీ... వచ్చిన ఆరు నెలలకి ఇప్పుడు వినాయక్ తన తదుపరి చిత్రం మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ తో చిత్రం మాత్రం ఓకే చేశాడనేది ఒక్క విషయం తప్పితే మరో న్యూస్‌ గానీ, అప్‌డేట్‌ కానీ లేదు. ఇప్పటికే చిరంజీవి, రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌లతో చిత్రాలు తీసిన ఆయన ఇప్పుడు మరో మెగా ఫ్యామిలీ హీరోతో, అందునా మాస్‌ హీరో అయ్యే లక్షణాలు, ఆ టైప్‌ బాడీలాంగ్వేజ్‌తో పాటు మాస్‌ అండ్‌ యాక్షన్‌ హీరోగా స్ధిరపడాలనే బలమైన కోరిక ఉన్న సాయిధరమ్‌తేజ్‌కి ఇది ఓ లక్‌ అనే చెప్పాలి.

సాయి ధరమ్ తేజ్‌ కెరీర్‌ ప్రారంభమైన కొంతకాలంలోనే వినాయక్ డైరెక్షన్ లో చేసే చాన్స్‌ వచ్చింది. ఇక ఈ చిత్రానికి వినాయక్‌ ఆస్థాన కవి ఆకుల శివ కథని అందిస్తుండగా సీనియర్‌ రైటర్లయిన పరుచూరిబ్రదర్స్‌, సత్యానంద్‌లు వర్క్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి హైలైట్‌ ఈ చిత్రం స్క్రిప్టే అంటున్న వినాయక్‌ ఈ చిత్రం టైటిల్‌ ప్రచారంలో ఉన్నట్లు 'దుర్గ' కాదని తేల్చేశాడు. మరో టైటిల్‌ను పరిశీలిస్తున్నామంటున్నాడు. మొత్తానికి 'దుర్గ' పవర్‌ఫుల్‌గానే ఉన్నా.. ఇంకా పవర్‌ఫుల్‌ టైటిల్‌ కోసం ట్రై చేస్తున్నారట. మరి వినాయక్ ,సాయి తో తియ్యబోయే చిత్రానికి ఎటువంటి మాస్ టైటిల్ పెడతాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

Similar News