నేటి నుండి తెలుగు సినిమా షూటింగ్స్ బంద్..!

నేటి నుండి తెలుగు సినిమా షూటింగ్స్ బంద్..!

Update: 2022-08-01 05:38 GMT

టాలీవుడ్‌లో ఆగస్టు 1 నుంచి షూటింగులు నిలిపివేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. ఆదివారం నాడు తెలుగు ఫిలిం ఛాంబర్ లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌లో షూటింగ్‌లు సోమవారం నుంచి ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో కొత్తగా మొదలయ్యే సినిమాలే కాదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా నిలిచిపోనున్నాయి.

నిర్మాతలే స్వయంగా బంద్‌కు పిలుపు ఇచ్చారు. టాలీవుడ్‌లో సమస్యలు ఉన్నాయి.. నిర్మాతల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. పెరిగిపోతున్న నిర్మాణ వ్యయాన్ని అదుపులో పెట్టాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తూ ఉన్నారు. హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకుంటే తప్ప నిర్మాణ వ్యయం అదుపులోకి రాదని భావిస్తూ ఉన్నారు. కేవలం హీరోల రెమ్యునరేషన్ల వల్లే బడ్జెట్లు పెరిగిపోతున్నాయా.. అనే చర్చ కూడా కొనసాగుతూ ఉంది.

టాప్ హీరోతో.. ఓ అగ్ర దర్శకుడు సినిమా చేయాలంటే... వారిద్దరి పారితోషికాలకే సగం బడ్జెట్‌ కేటాయించాల్సివస్తోందని అంటున్నారు. సినిమా హిట్టయితే పర్వాలేదు.. అదే ఫ్లాప్ అయితే.. ఏంటనే ప్రశ్నలు చిత్ర పరిశ్రమను వెంటాడుతూ ఉన్నాయి. అగ్ర హీరోలు తమ పారితోషికంలో కనీసం 30 శాతం తగ్గించుకోవాలనేది ప్రధానమైన డిమాండ్‌గా వినిపిస్తోంది. సగం పారితోషికం ఇచ్చి, మిగిలిన సగం సినిమా హిట్టయితే, లాభాల రూపంలో స్వీకరించాలని కూడా అంటున్నారు.

అయితే రెమ్యునరేషన్ విషయంలో హీరోల తప్పు లేదని అంటున్నారు సినీ ప్రముఖులు. ''ఆపిల్‌ ఫోను ఖరీదెక్కువ. అదే ఫీచర్స్‌తో ఉన్న చైనా ఫోను చాలా తక్కువ ధరలో దొరుకుతుంది కదా అంటే ఎలా? ఆపిల్‌ అనేది బ్రాండ్‌. హీరోలకూ అలాంటి బ్రాండే ఉంటుందని అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆ బ్రాండుకి తగినట్టు చెల్లించాల్సిందే.. స్టార్‌ హోటెల్‌లో దోశ కంటే, వీధిలో బడ్డీ కొట్టు దగ్గర దోశ తక్కువ రేటుకి దొరుకుతుంది. ఎక్కడ తినాలన్నది నీ ఇష్టం. ఎవరితో సినిమా చేస్తే ఎక్కువ గిరాకీ ఉంటుందో నిర్మాతలు ఆలోచించుకోవాలన్నారు వర్మ.


Tags:    

Similar News