మేజర్ సినిమాపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. స్పందించిన మహేష్ బాబు, అడివి శేష్

'మేజర్' చిత్రంపై జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు.పార్టీ పనులతో బిజీగా ఉన్నానని, అందుకే ఇప్పటివరకు 'మేజర్'

Update: 2022-06-12 14:38 GMT

'మేజర్' చిత్రంపై జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు.పార్టీ పనులతో బిజీగా ఉన్నానని, అందుకే ఇప్పటివరకు 'మేజర్' చిత్రాన్ని చూసేందుకు వీలుపడలేదని వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమాను చూస్తానని తెలిపారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అపూర్వ ఆదరణ గురించి తెలుసుకున్నానని, ఎంతో సంతోషం కలిగిస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అన్ని భాషల వారిని మెప్పిస్తున్న ఈ చిత్రం తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందంగా ఉందని అన్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వంటి సైనికాధికారులు, సిబ్బంది దేశభద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలని పవన్ ఆకాంక్షించారు. ముంబయి మహానగరంలో 2008 నవంబరు 26న ఉగ్రవాదులు జరిపిన ఘాతుకాలను 26/11 మారణహోమంగా ఈ దేశం గుర్తుంచుకుందని.. నాడు జరిగిన కమాండో ఆపరేషన్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సాహసాలు, ఆయన వీరమరణాన్ని వెండితెరపై 'మేజర్' గా ఆవిష్కరించిన చిత్రబృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుటున్నట్టు వెల్లడించారు. 'మేజర్' చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన మహేశ్ బాబును, చిత్ర నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డిలను అభినందిస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో నటించిన ప్రకాశ్ రాజ్, రేవతి, సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, మురళీ శర్మ, ఇతర టెక్నీషియన్లకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. "మేజర్ చిత్రం కథానాయకుడు, సోదరుడు అడివి శేష్ కు హృదయపూర్వక అభినందనలు. ప్రఖ్యాత రచయిత, దివంగత అడివి బాపిరాజు గారి మనవడైన శేష్ సినిమా రంగంలో భిన్న శాఖలపై అభినివేశం ఉన్న సృజనశీలి" అని మెచ్చుకున్నారు.

పవన్ కళ్యాణ్ స్పందనపై ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సూపర్ స్టార్ మహేశ్ బాబు, హీరో అడివి శేష్ స్పందించారు. "థాంక్యూ పవన్ కళ్యాణ్.. మీ స్పందనతో మేజర్ టీమ్ నిజంగా ఆనందంతో పొంగిపోతోంది" అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.అడివి శేష్ ట్విట్టర్ లో "డియర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... నా హృదయం ఆనందంతో నిండిపోయింది. టూర్ బిజీగా ఉండేసరికి మీకు మేజర్ సినిమా చూసే టైమ్ ఉంటుందా అని అనుకున్నా. కానీ మీరు వ్యక్తిగతంగా ఎంతో హృదయపూర్వకంగా రాసిన లేఖ నిజంగా మనసును తాకింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ను నా సర్వస్వంగా భావిస్తాను. ఆ రోజు పంజా, ఇవాళ మేజర్. మీ అభిమానానికి ధన్యుడ్ని" అంటూ అడివి శేష్ చెప్పుకొచ్చాడు.


Tags:    

Similar News