ధనుష్ హీరోగా ఇళయరాజా బయోపిక్‌..!

మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ లో కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించబోతున్నాడట.

Update: 2023-10-31 11:01 GMT

మాస్ట్రో ఇళయరాజా దశబ్దాల కాలం నుంచి తన సంగీతంతో ప్రతి ఒక్కర్ని మంత్రముగ్దులను చేస్తూ వస్తున్నారు. 50 ఏళ్ళ సంగీత కెరీర్ లో 1000 పైగా చిత్రాలకు 7000కు పైగా పాటలు, 20,000 పైగా మ్యూజికల్ కాన్సర్ట్ షోలు చేసి సంగీత సాగరాన్ని సృష్టిస్తున్నారు. ఇప్పటికి కూడా ఇళయరాజా.. సినిమాకి తన సంగీత సేవని అందిస్తూనే వస్తున్నారు. కాగా ఈ మ్యూజికల్ లెజెండ్ జీవితాన్ని ఇప్పుడు బయోపిక్ రూపంలో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారట.

ఇళయరాజా పాత్రలో కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించబోతున్నాడని సమాచారం. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ లతా శ్రీనివాసన్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ధనుష్ హీరోగా ఇళయరాజా బయోపిక్‌ ని తెరకెక్కించబోతున్నారు. 2024లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి 2025లో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి 'మాస్ట్రో' అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారట. ‘కనెక్ట్ మీడియా’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతుందట.
ఈ వార్త పక్కా నమ్మదగిన సమాచారమే అని, ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా కూడా ఈ విషయాన్ని ద్రువీకరిచినట్లు జర్నలిస్ట్ లతా శ్రీనివాసన్ పేర్కొంది. ధనుష్ తన తండ్రి పాత్రని చేయడం తనకి చాలా సంతోషాన్ని ఇస్తుందని యువన్ చెప్పినట్లు ఆమె వెల్లడించింది. అయితే ఈ సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అనేది తెలియజేయజేయలేదు. ప్రస్తుతం ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా చిత్రీకరణలో ఉన్నాడు.
అనంతరం శేఖర్ కముల డైరెక్షన్ లో ఒక మూవీ, తన స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇక్కడ ప్రేక్షకుల ఒక సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇళయరాజా బయోపిక్ ని ధనుషే డైరెక్ట్ చేయబోతున్నాడా..? అని ప్రశ్నలు వేస్తున్నారు. మరి ఈ బయోపిక్ ఎవరు తెరకెక్కిస్తారో చూడాలి. కాగా ఇండియన్ సినిమా హిస్టరీలో తెరకెక్కే మొదటి మ్యూజికల్ బయోపిక్ ఇదే. తన సంగీతంతో మన మనసులు బరువెక్కించే ఇళయరాజా సంగీతం వెనుక ఎలాంటి బరువైన కథ ఉందో బయోపిక్ తో తెలియనుంది.



Tags:    

Similar News