రాజకీయాల్లోకి రష్మిక.! ఆ పార్టీలో చేరిక.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

Update: 2022-09-05 11:02 GMT

సెలబ్రిటీ జోతిష్యుడుగా పేరుతెచ్చుకున్న వేణు స్వామి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో నాగ చైతన్య, సమంత విడిపోతారని ముందే చెప్పి సంచలనం రేపిన ఆయన తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాజకీయాల్లోకి వెళ్లబోతుందంటూ మరో బాంబు పేల్చారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న గ్లామరస్ హీరోయిన్.. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్న కన్నడనాట రాజకీయాల్లో అరంగేట్రం చేయనుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆమె ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారో కూడా ఆయన చెప్పేశారు. రష్మిక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వేణు స్వామి చెప్పారు. ఆమె జాతకంలో రాజకీయ ప్రవేశం ఉందని ఆయన అన్నారు. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌తో సహా బాలీవుడ్‌లోనూ ఆమెకు క్రేజీ ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో వేణు స్వామి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కన్నడ నాట సినీనటులు రాజకీయాల్లోకి రావడం కూడా కొత్తేమీ కాదు. సీనియర్ నటి సుమలత ఇప్పటికే మాండ్య ఎంపీగా కొనసాగుతున్నారు. 2013 ఉప ఎన్నికల్లో మరో హీరోయిన్ రమ్య ఎంపీగా ఎన్నికయ్యారు. కన్నడ రాజకీయాల్లో హీరోయిన్ల ఎంట్రీ కొత్తేమీ కాకపోయినా కెరీర్‌పరంగా దూసుకుపోతున్న రష్మిక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోందన్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అందులోనూ ఆమె కోసం తాను పూజలు చేశానని గతంలో చెప్పిన వేణుస్వామి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

Tags:    

Similar News