గాజా గజగజ.. వందల సంఖ్యలో శవాలు

ఇజ్రాయిల్ - పాలస్తీనాల మధ్య యుద్ధం గత మూడు రోజుల నుంచి కొనసాగుతుంది

Update: 2023-10-10 03:13 GMT

ఇజ్రాయిల్ - పాలస్తీనాల మధ్య యుద్ధం గత మూడు రోజుల నుంచి కొనసాగుతుంది. ఇప్పటికే వందల సంఖ్యలో ప్రజలు యుద్ధం కారణంగా మృత్యువాత పడ్డారు. హమాస్ సైన్యాన్ని కట్టడి చేసేందుకు ఇజ్రాయిల్ సైన్యం తీవ్రంగా శ్రమిస్తుంది. గాజాపై దాడులను ఉధృతం చేసింది. ఇప్పటికే రాకెట్ల దాడులతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావద్దని ఇజ్రాయిల్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలను జారీ చేసింది.

దాడులు - ప్రతి దాడులు...
ఇటు హమాస్ మిలిటెంట్లు సయితం ఇజ్రాయిల్ సైన్యంపై దాడులకు దిగుతున్నారు. దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయిల్ సైన్యం కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. యుద్ధం కారణంగా భయానక వాతావరణం నెలకొంది. అనేక మృతదేహాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటున్నాయి. హమాస్ దాడిలో ఇప్పటికే ఏడు వందలకు మందికి పైగా ప్రజలు మరణించారని ఇజ్రాయిల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయిల్ దాడిలో పాలస్తీనాకు చెందిన ఐదు వందల మంది వరకూ మృతి చెందారని చెబుతున్నారు. దీంతో యుద్ధం భీకరంగా సాగుతుండటంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
బయటకు రావడానికే...
దక్షిణ గాజాలోని రఫాలో నిన్న జరిగిన ఇజ్రాయిల్ దాడుల్లో మహిళలతో సహా చిన్నారులు మరణించినట్లు తెలిపింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రతి క్షణం కాల్పుల శబ్దంతో గాజా ప్రాంతం దద్దరిల్లిపోతుంది. ప్రజలు గత మూడు రోజుల నుంచి బయటకు రావడానికే భయపడిపోతున్నారు. హమాస్ సైన్యం ఇజ్రాయిల్ పౌరులను బందీలుగా పట్టుకుందన్న వార్తల నేపథ్యంలో ఆ దేశం మరింత కట్టుదిట్టమైన వ్యూహంతో ముందుకు వెళుతుంది. యుద్ధం కొనసాగుతూనే ఉండటంతో గాజా ప్రాంతం గజగజ వణికిపోతుంది. ప్రజలను అనేక ప్రాంతాల నుంచి ప్రభుత్వం ఖాళీ చేయించి మరీ ఇజ్రాయిల్ దాడులకు దిగుతోంది.


Tags:    

Similar News