ఇరాన్ - అమెరికాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. కానీ ఈ చర్చల్లో అనేక అంశాలు కీలకంగా మారకనున్నాయి. ఇరాన్లో కాల్పుల విరమణ ఇంకా అస్థిరంగానే ఉన్న వేళ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శుక్రవారం పాకిస్తాన్కు బయల్దేరారు. ఇరాన్ ప్రతినిధులతో ఉన్నత స్థాయి చర్చలు జరపాలని ఆయన ప్రయాణం. ఇదే సమయంలో ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య కాల్పులు కొనసాగుతుండగా, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టు కొనసాగిస్తోంది. యుద్ధాన్ని శాశ్వతంగా ఆపే విస్తృత ఒప్పందం దిశగా చర్చలు సాగుతున్నప్పటికీ, విరమణను దెబ్బతీసే అంశాలు అనేకం ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ విప్లవ గార్డుకు సమీపంగా భావించే ‘తస్నీమ్’ వార్తా సంస్థ, లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆగితేనే శనివారం జరగాల్సిన చర్చలు జరుగుతాయని పేర్కొంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమంలో, హార్ముజ్ జలసంధి ద్వారా నౌకా రాకపోకలు నిలిపివేయడమే ఇరాన్కు ఉన్న ఏకైక ఒత్తిడి సాధనమని వ్యాఖ్యానించారు.
కువైట్ పై దాడులకు...
ఇక కువైట్ గురువారం నుంచి ఏడు డ్రోన్ దాడులు జరిగాయని, వాటికి ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియాలే కారణమని ఆరోపించింది. గార్డు ఈ ఆరోపణలను ఖండించినా, గతంలో పశ్చిమాసియాలో తాము ప్రకటించని దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. వాన్స్ ఎయిర్ఫోర్స్ టూ విమానంలో ఇస్లామాబాద్కు బయల్దేరగా, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఖలీబాఫ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా అక్కడికి చేరింది. భద్రత, రాజకీయ, సైనిక, ఆర్థిక, న్యాయ బృందాలు ఈ ప్రతినిధుల్లో ఉన్నాయి. తమ ముందస్తు షరతులు అంగీకరిస్తేనే చర్చలు మొదలవుతాయని ఇరాన్ పేర్కొంది. లెబనాన్లో కాల్పుల విరమణ, నిలిపివేసిన ఇరాన్ ఆస్తుల విడుదల అనే రెండు అంశాలు ఇంకా అమలుకాలేదని ఖలీబాఫ్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. “ఈ రెండూ నెరవేరితేనే చర్చలు మొదలవుతాయి” అని ఆయన రాశారు.
ఇజ్రాయెల్–లెబనాన్ చర్చలు...
ఇరాన్తో విరమణ ఒప్పందంలో హెజ్బొల్లాపై దాడులు ఆపే నిబంధన లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. విరమణ ప్రకటించిన రోజే ఇజ్రాయెల్ బీరుట్పై వైమానిక దాడులు చేసి 300 మందికిపైగా మరణించినట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ తెలిపింది.ట్రంప్ గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూతో మాట్లాడి దాడులు తగ్గించాలని కోరినట్లు తెలిపారు. అయినా శుక్రవారం దక్షిణ లెబనాన్లోని నబతియె పట్టణంలో ప్రభుత్వ భద్రతా కార్యాలయం సమీపంలో ఇజ్రాయెల్ దాడి జరగగా 13 మంది అధికారులు మరణించినట్లు లెబనాన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది.ఇజ్రాయెల్ ప్రకారం, ఉత్తర ఇజ్రాయెల్పై రాకెట్లు ప్రయోగించిన లాంచర్లపై కూడా దాడులు చేశామని పేర్కొంది.లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ కార్యాలయం ప్రకారం, మంగళవారం నుంచి అమెరికా రాజధానిలో ఇజ్రాయెల్–లెబనాన్ నేర చర్చలు మొదలవుతాయి. ఈ చర్చలకు అమెరికా విదేశాంగ శాఖ మధ్యవర్తిత్వం చేస్తుంది.హెజ్బొల్లా నాయకుడు నయీమ్ ఖాసెమ్ లెబనాన్ అధికారులు “ఉచిత రాయితీలు” ఇవ్వొద్దని హెచ్చరించినా, చర్చలపై స్పష్టమైన వైఖరి వెల్లడించలేదు.
హార్ముజ్ జలసంధి కీలకం...
హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు ధరలు ఎగసిపడ్డాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు 97 డాలర్లకు చేరి, యుద్ధం మొదలైనప్పటి నుంచి 30 శాతం పెరిగాయి. విరమణ ఉన్నా రోజుకు వందకు పైగా నౌకలు వెళ్లే మార్గంలో ప్రస్తుతం కేవలం 12 మాత్రమే ప్రయాణిస్తున్నాయి.“అంతర్జాతీయ జలమార్గాలను ఉపయోగించి ప్రపంచాన్ని తాత్కాలికంగా బెదిరించడం తప్ప ఇరాన్కు ఎలాంటి కార్డులు లేవు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇరాన్ క్షిపణి, అణు కార్యక్రమాల భవితవ్యంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. అణ్వాయుధాలు తయారు చేయకుండా ఉండాలని అమెరికా, ఇజ్రాయెల్ పట్టుబడుతున్నాయి. అధికంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తొలగించాలని అమెరికా కోరుతోంది. ఇరాన్ మాత్రం తన కార్యక్రమం శాంతి ప్రయోజనాలకేనని చెబుతోంది.
మూడువేల మందికిపైగా మృతి...
యుద్ధంలో ఇరాన్లో 3,000 మందికిపైగా మరణించినట్లు అక్కడి ఉన్నత అధికారి వెల్లడించారు. లెబనాన్లో 1,953 మంది మరణించగా, లక్షలాది మంది నివాసాలు కోల్పోయారు. ఇజ్రాయెల్లో 23 మంది పౌరులు, అమెరికా సైనికుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రకారం, ఇరాన్ రూపకల్పన చేసిన షాహెద్ డ్రోన్లను పశ్చిమాసియాలో తమ బలగాలు కూల్చివేశాయని తెలిపారు. రష్యా ఉక్రెయిన్లో వాడుతున్న ఆయుధాలే కావడంతో భాగస్వామ్య దేశాలకు సహాయం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.