కరోనా వైరస్ మానవ సృష్టి కాదట .. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఏం చెప్పిందంటే..

2019లో చైనాలోని వుహాన్‌లో కరోనా తొలి కేసు వెలుగు చూసింది. దీంతో జనవరి 2020లో అక్కడి చేపల మార్కెట్‌ను మూసివేశారు.

Update: 2023-03-18 07:09 GMT

చైనాలో పుట్టి.. ప్రపంచ దేశాలను దాదాపు రెండేళ్లపాటు గడగడలాడించింది కరోనా వైరస్. ఇప్పటికీ భారత్, చైనా సహా చాలా దేశాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే.. కరోనా వైరస్ ఎలా పుట్టింది ? ఇది చైనా ప్రపంచదేశాలపై పరోక్షంగా చేసిన యుద్ధమా ? చైనా శాస్త్రవేత్తలే దీనిని తయారు చేశారా ? ఇది మానవ సృష్టా ? లేక ప్రకృతి ప్రకోపమా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సమాధానాలిచ్చింది. కరోనా వైరస్ మానవసృష్టి కాదని తేల్చి చెప్పేసింది. అది ప్రకృతి నుంచే పుట్టుకొచ్చిందని తేల్చింది.

చైనాలోని వుహాన్‌లో చేపల మార్కెట్‌లో విక్రయించిన రాకూన్ జాతి కుక్కల జన్యుపదార్థంలోకరోనా కారకమైన సార్స్ కోవ్-2 వైరస్ ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిపింది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. కరోనా వైరస్ ప్రయోగశాల నుంచి లీకై ఉండొచ్చని అమెరికా ఇంధన శాఖ అంచనా వేసిన కొన్ని రోజులకే అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఇది మానవ సృష్టి కాదని చెప్పడం గమనార్హం. ఇప్పుడు ఏది నిజమని నమ్మాలన్న సందిగ్ధంలో ఉన్నారు ప్రజలు.
2019లో చైనాలోని వుహాన్‌లో కరోనా తొలి కేసు వెలుగు చూసింది. దీంతో జనవరి 2020లో అక్కడి చేపల మార్కెట్‌ను మూసివేశారు. ఆ తర్వాత శాస్త్రవేత్తలు అక్కడి గోడలు, ఖాళీ బోనులు, గచ్చుల మీది నుంచి నమూనాలు సేకరించి, జీనోమ్ సీక్వెన్స్‌ ను అంతర్జాతీయ ఏవియన్ ఫ్లూ సమాచార మార్పిడి వేదికపై ఉంచారు. మార్కెట్లోని ఓ బండిపై పక్షుల పంజరం, వేరే బోనులో రాకూన్ కుక్కలను ఉంచినట్టు శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. అక్కడ సేకరించిన జన్యు నమూనాలో రాకూన్ శునకం న్యూక్లిక్ ఆమ్లం, వైరస్ న్యూక్లిక్ ఆమ్లం కలిసి ఉన్నట్టు గుర్తించారు. రాకూన్ కుక్కకు వైరస్ సోకినా అది నేరుగా దాని నుంచి మానవులకు వ్యాపించి ఉండకపోవచ్చని, మానవుల ద్వారా లేదా మరేదైనా జంతువు ద్వారా అది సోకి ఉండొచ్చని చెబుతున్నారు. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.


Tags:    

Similar News