Hyderabad : షేర్ మార్కెట్ పేరుతో సినీ దర్శకుడి కుమారుడికి 63 లక్షల టోకరా
హైదరాబాద్ లో ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడి కుమారుడు షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి గురయ్యాడు
హైదరాబాద్ లో ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడి కుమారుడు షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి గురయ్యాడు. హైదరాబాద్కు చెందిన దంపతులు అధిక లాభాలు ఇస్తామని నమ్మబలికి సుమారు అరవై లక్షలు కాజేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసుల కేసు నమోదు చేశారు. అనుష, ప్రణీత్ అనే దంపతులు తమను అనుభవజ్ఞులైన స్టాక్ మార్కెట్ నిపుణులుగా పరిచయం చేసుకున్నారు. ట్రేడింగ్లో భారీ లాభాలు వస్తాయని చెప్పి పెట్టుబడులు పెట్టించారని సమాచారం.
ఇద్దరిపై కేసు నమోదు చేసి...
బాధితుడి నమ్మకం పొందేందుకు నకిలీ లాభాల స్టేట్మెంట్లు చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి మాటలు నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టిన బాధితుడికి లాభాలు రావడమే కాకుండా పెట్టిన మూలధనం కూడా తిరిగి రాలేదు. పలుమార్లు అడిగినా డబ్బు ఇవ్వకపోవడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.బాధితుడి ఫిర్యాదు ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బు ఎక్కడకు వెళ్లిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహా ఫిర్యాదులు ఇంకెవరైనా ఇచ్చారా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.