హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీల సందడి
హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలకు అధికారులు అంతా సిద్ధం చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి
హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలకు అధికారులు అంతా సిద్ధం చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. "తెలంగాణ జరూర్ ఆనా" నినాదం ప్రతి చోటా కనిపించేలా, వినిపించేలా పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. నేడు మరో మూడు దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రానున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈరోజు పోర్చుగల్, ఘనా, ఐర్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిధులు శంషాబాద్ రానున్నారు. వీరికి పూర్తి సంప్రదాయ లాంఛనాలతో స్వాగతం పలికేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది.
ఇప్పటికే చేరుకున్న...
స్వాగత సత్కారాలతో పాటు, భద్రత, వసతికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. పోర్చుగల్ కు చెందిన మారియా అమెలియా ఆంటోనియో, ఘనా నుంచి జుట్టా అమా పోకుహా అడ్డో, ఐర్లాండ్ కు చెందిన జాస్మిన్ జెర్హార్డ్ లు హైదరాబాద్ చేరుకుంటారు. మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్ జన్సెన్ వాన్ రెన్స్ బర్గ్ , మిస్ బ్రెజిల్ జెస్సికా స్కేన్ద్రియుజ్య్ పెడ్రోసో , మిస్ వరల్డ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డయన్నా క్యాథరీన్ మొర్రిసన్ లు ఇప్పటికే చేరుకున్నారు. అత్యధిక కంటెస్టెంట్లు ఈ నెల ఏడవ తేదీ నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఈనెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ కార్యక్రమం జరగనుంది.