ఉస్మానియా జర్నలిజం విభాగంలో AI నైపుణ్యాలకు సంబంధించి వర్క్షాప్ నిర్వహించిన సుధాకర్ ఉడుముల
కృత్రిమ మేధస్సు కారణంగా ఎన్నో సవాళ్లు కూడా ఎదురవుతూ ఉన్నాయి
మీడియా వ్యవస్థలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కీలక భూమిక పోషిస్తూ ఉంది. కృత్రిమ మేధస్సు కారణంగా ఎన్నో సవాళ్లు కూడా ఎదురవుతూ ఉన్నాయి. విద్యార్థులను వీటన్నింటికీ సిద్ధం చేయాలనే లక్ష్యంతో గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగంలో ఒక రోజంతా AI వర్క్షాప్ నిర్వహించారు. ఈ సెషన్ ADIRA (AI ఫర్ డిజిటల్ రెడీనెస్ & అడ్వాన్స్మెంట్)లో భాగంగా నిర్వహించారు. దీన్ని AI ఆపర్చునిటీ ఫండ్: ఆసియా-పసిఫిక్ ద్వారా ప్రారంభించారు. దీనికి Google.org, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మద్దతు ఇస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం DataLEADS మద్దతుతో నిర్వహిస్తూ ఉంది.
ఈ వర్క్షాప్కు సీనియర్ జర్నలిస్ట్, ఫ్యాక్ట్-చెక్ ట్రైనర్ సుధాకర్ రెడ్డి ఉడుముల నాయకత్వం వహించారు. ఆయన హైదరాబాద్లోని టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎడిటర్ (ఇన్వెస్టిగేషన్స్)గా ఉన్నారు. పరిశోధనాత్మక జర్నలిజం, యుద్ధ ప్రాంతాల నుండి రిపోర్టింగ్లో 28 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న సుధాకర్ రెడ్డి ఉడుముల ఈ సెషన్ లో ఎన్నో విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు.
ఈ సెషన్ లో AI ప్రయోజనాలపై మాత్రమే కాకుండా దాని పరిమితులపై కూడా దృష్టి సారించారు. ముఖ్యంగా తప్పుడు సమాచారం, ఎడిట్ చేసిన విజువల్స్ ను గుర్తించడంపై పలు సలహాలు, సూచనలు అందించారు. AI సాధనాలను బాధ్యతాయుతంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని, వాస్తవాలను ధృవీకరించడంలో తీసుకోవాల్సిన నిర్ణయాల ప్రాముఖ్యతను కూడా సుధాకర్ రెడ్డి ఉడుముల వివరించారు.