పశువుల కాపరి.. పరిశోధకుడయ్యాడు!!
పదమూడు సంవత్సరాల వయసు వచ్చేవరకు బడికి వెళ్లలేదు.
పదమూడు సంవత్సరాల వయసు వచ్చేవరకు బడికి వెళ్లలేదు. తండ్రి జీతానికి ఉండే ఇంట్లో పశువుల కాపరిగా నాలుగేళ్లు పనిచేశాడు. కానీ అతడికి చదువంటే ఇష్టముంది. అలాంటి కుర్రాడు ఇప్పుడు ఓయూ జియాలజీ విభాగం నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండనగుల గ్రామానికి చెందిన చింతా పరమేశ్ ఇన్స్పిరేషన్ స్టోరీ ఇది. స్కూలుకు వెళ్లకపోయినా పండగకు కొత్త దుస్తులుగా స్కూల్ యూనిఫామ్ కుట్టించుకునేవాడు. ఊళ్లో జాతరకు వెళుతుంటే ఎంవీ ఫౌండేషన్ కార్యకర్త మౌలాలీ గమనించి, బ్రిడ్జ్ క్యాంపులో పరమేశ్ ను చేర్చాడు. 14 ఏళ్ల వయసులో ఏడో తరగతి బోర్డు పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. బల్మూరు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ పదో తరగతి పాసయ్యాడు. కల్వకుర్తిలోని గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ సైఫాబాద్లోని సైన్స్ కళాశాలలో బీఎస్సీ, ఓయూ ప్రాంగణంలో ఎంఎస్సీ జియాలజీ పూర్తి చేశాడు. పీజీలో 85 శాతం మార్కులతో డిస్టింక్షన్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఓయూలో పీహెచ్డీ సీటు సంపాదించాడు. ఆచార్య మురళీధర్ పర్యవేక్షణలో అమ్రాబాద్, పదర మండలాల్లో భూగర్భ జల పరిస్థితులపై అధ్యయనం చేసి పరిశోధనా పత్రం సమర్పించారు. 35 సంవత్సరాల వయసులో పీహెచ్డీ పట్టా అందుకున్నారు.