బ్యాంక్‌ లావాదేవీల్లో చొరబడ్డ హ్యాకర్లు – ఫిన్‌టెక్‌ ఫర్మ్‌కి నష్టం

నగరానికి చెందిన ఫిన్‌టెక్‌ సంస్థ ఫ్లెక్సీపే సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ ఖాతాల్లోకి హ్యాకర్లు చొరబడి అక్రమ లావాదేవీలు జరిపి ₹1.3 కోట్లు

Update: 2025-09-23 09:52 GMT

హైదరాబాద్‌ : నగరానికి చెందిన ఫిన్‌టెక్‌ సంస్థ ఫ్లెక్సీపే సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ ఖాతాల్లోకి హ్యాకర్లు చొరబడి అక్రమ లావాదేవీలు జరిపి ₹1.3 కోట్లు నష్టం కలిగించారని సంస్థ సీఈఓ గడ్డె చంద్రశేఖర్‌ (42) ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీ 91 స్ప్రింగ్‌బోర్డ్‌, హైటెక్ సిటీలో ప్రధాన కార్యాలయం కలిగి, బిల్లు, ఇల్లు అద్దె, విద్యా ఫీజు చెల్లింపుల యాప్‌లను నడుపుతోంది.

ఆడిట్‌లో బయటపడిన మోసం

సెప్టెంబర్‌ 15న లావాదేవీల అంతర్గత ఆడిట్‌లో ₹1,39,95,215 అనుమానాస్పద డెబిట్‌లు బయటపడ్డాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సాంకేతిక పరిశీలనలో తెలియని వ్యక్తులు సర్వర్‌కి అనధికారికంగా ప్రవేశించి అనేక ఫండ్‌ ట్రాన్స్‌ఫర్లు జరిపినట్టు తేలింది.

బ్యాంక్‌ ఏపీఐలతో మోసం

హ్యాకర్లు వ్యవస్థ పనితీరును ముందుగా అధ్యయనం చేసి, వరుసగా API రిక్వెస్ట్‌లు యెస్‌ బ్యాంక్‌ (కస్తూర్బా రోడ్‌ బ్రాంచ్‌, బెంగళూరు)కు పంపారని గుర్తించారు. వైట్‌లిస్ట్‌ చేసిన ఐపీల ద్వారా రిక్వెస్ట్‌లు వెళ్ళడంతో ఫండ్లు పలు ఖాతాలకు మళ్లించబడ్డాయి. డేటాబేస్‌ భద్రంగా ఉన్నప్పటికీ, సర్వర్‌ మౌలిక వసతులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో తెలిపారు. జస్‌పే సంస్థ సహకారంతో అనుమానాస్పద ఐపీ వివరాలు పోలీసులు సేకరించారు.

ఐటీ చట్టం కింద కేసు

అనధికార ప్ర‌వేశం, సైబ‌ర్ మోసం, మోసం చేయడం, విశ్వాసం ద్రోహం, గుర్తింపుల దొంగతనం, కుట్ర ఆరోపణలతో కేసు నమోదు చేయాలని చంద్రశేఖర్‌ కోరారు. అనుమానాస్పద ఐపీ వాడినవారు, డబ్బు పొందిన ఖాతాదారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దర్యాప్తుకు కావాల్సిన పత్రాలు, టెక్నికల్‌ రిపోర్టులు, సాక్ష్యాలు అందిస్తామని ఫ్లెక్సీపే హామీ ఇచ్చింది.

పోలీసులు ఫిర్యాదు స్వీకరించి, సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News