ఆన్లైన్ బెట్టింగ్లో భారీ మోసం..రూ.1.5 కోట్లు కోల్పోయిన హైదరాబాద్ వ్యాపారి
వాట్సాప్ ప్రకటనలతో ఉచ్చులోకి లాగిన ముఠా లాభాల పేరుతో సైట్లు మార్చుతూ డబ్బు దోచుకున్న నిందితులు
హైదరాబాద్: త్వరగా అధిక లాభాలు వస్తాయని నమ్మి ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టుబడులు పెట్టిన 33 ఏళ్ల హైదరాబాద్ వ్యాపారి రూ.1.5 కోట్లు కోల్పోయాడు. పరస్పరం అనుసంధానమైన పలు వెబ్సైట్ల ద్వారా ఈ మోసం జరిగిందని పోలీసులు తెలిపారు.
లక్డీకాపూల్ ఏసీ గార్డ్స్లోని మారుతి కోఆపరేటివ్ సొసైటీకి చెందిన రాగి పరమేశ్వర్ రెడ్డి ఫిబ్రవరి 14న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘బెటిన్ ఎక్స్చేంజ్’ ప్రతినిధులమని చెప్పిన వ్యక్తులు వాట్సాప్ ప్రకటనలు, ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదించారు. 2025లో క్రికెట్, టీన్ పట్టి, కాసినో గేమ్లపై బెట్టింగ్ చేస్తే “గ్యారంటీ లాభాలు” వస్తాయని నమ్మించారు.
మొదట ట్రయల్గా రూ.20,001 జమ చేయగా రూ.5,000 లాభం వచ్చిందని తెలిపారు. దీంతో అతనిలో నమ్మకం పెరిగింది. తరువాత కస్టమర్ సపోర్ట్ పేరుతో మాట్లాడిన వారు పెద్ద మొత్తాలు పెట్టాలని ఒత్తిడి చేశారు. 2025 నుంచి 2026 జనవరి మధ్య తన ఖాతా, భార్య ఖాతాల నుంచి బ్యాంకు ఖాతాలు, యూపీఐ, క్యూ ఆర్ కోడ్లు, నగదు డిపాజిట్ యంత్రాల ద్వారా మొత్తం రూ.1.5 కోట్లు జమ చేశాడు. ప్రారంభంలో వచ్చిన రూ.20 లక్షల లాభం తరువాత భారీ నష్టాల్లో కలిసిపోయింది.
సైట్లు మారుస్తూ మాయచేసిన ముఠా
డొమైన్ పేర్లు, బ్యాంకు ఖాతాలు (యూనియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ), ఫోన్ నంబర్లు తరచూ మార్చుతూ నిందితులు జాడ తప్పించుకున్నారని బాధితుడు పేర్కొన్నారు. డబ్బు ఉపసంహరణకు ప్రయత్నించగా అడ్డంకులు సృష్టించారని, బెట్టింగ్ ఫలితాలు కూడా తమకు అనుకూలంగా మలిచారని ఆరోపించారు.
రూ.9,000 నుంచి రూ.40,000 మధ్య జరిగిన వందలాది లావాదేవీల వివరాలు, వాట్సాప్ నంబర్లు, ఈమెయిల్, ఇన్స్టాగ్రామ్ లింకులు పోలీసులకు అందజేశారు. సంబంధిత బ్యాంకు ఖాతాలను గుర్తించి నిర్వాహకులపై మోసం, అక్రమ బెట్టింగ్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.