ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఏర్పేడు సిఐ శ్రీహరి సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా..

Update: 2023-06-01 03:21 GMT

తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తురోడాయి. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి - శ్రీకాళహస్తి ప్రధాన రహదారిలో ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో భార్యభర్తలతో పాటు ఓ చిన్నారి కూడా మరణించింది. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఏర్పేడు సిఐ శ్రీహరి సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులంతా తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లెకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోనూ ఘోర ప్రమాదాలు జరిగాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలో ఓ ప్రమాదం జరిగింది. కొణిజర్ల దగ్గర లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు పారుపల్లి రాజేష్, సుజాత దంపతులు, వారి కుమారుడు అశ్విత్ 13 గా గుర్తించారు. మరో ఘటనలో.. పెనుబల్లి వీఎం బంజర సమీపంలో రెండు లారీలు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ఎదురుగా వస్తున్న లారీని మరో లారీ ఢీ కొట్టింది. దీంతో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. వాటిలో రెండు లారీల డ్రైవర్లిద్దరూ ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసిన కొద్దిసేపటికే మరణించారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో మరో ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న సోయం శ్రీహరి (50) మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.


Tags:    

Similar News