వరుడి మృతితో పెళ్లింట విషాదం..

కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని కుమురం భీం జిల్లా కౌటాల మండలం గుడ్లబోరి..

Update: 2023-06-15 05:47 GMT

మేళతాళాలు, బంధుమిత్రుల ముచ్చట్లతో, పిల్లల అల్లర్లతో, బావా-మరదళ్ల కొంటె చేష్టలతో సరదాగా, కళకళలాడాల్సిన పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్ది గంటల్లో పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు.. కాటికెళ్లాడు. వడదెబ్బ రూపంలో అతడిని మృత్యువు కబళించింది. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని కుమురం భీం జిల్లా కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన గుండ్ల శ్యాంరావ్ - యశోద దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్దకొడుకైన తిరుపతి(32)కి మంచిర్యాల జిల్లా భీమినికి చెందిన యువతితో వివాహం నిశ్చయయమైంది. జూన్ 14న గుడ్లబోరిలో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

పెళ్లి పనుల్లో నిమగ్నమైన తిరుపతి వడదెబ్బకు గురయ్యాడు. అస్వస్థతగా ఉండటంతో మండల కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. అక్కడ తగ్గకపోవడంతో సాయంత్రం కాగజ్ నగర్ కు ఆసుపత్రికి తరలించారు. మంగళవారం అర్థరాత్రి ఆరోగ్యం విషమించడంతో తిరుపతిని మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మృతి చెందాడు. దాంతో నూతన దంపతులతో కళకళలాడాల్సిన పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి.


Tags:    

Similar News