కార్లలో ఎయిర్‌ బ్యాగ్స్‌ విషయంలో కేంద్రం యూటర్న్‌

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపం, ట్రాఫిక్‌ నిబంధనలు..

Update: 2023-09-15 05:03 GMT

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపం, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడం, ఓవర్‌టెక్‌ తదితర కారణాలవల్ల ప్రతి రోజు జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ ప్రమాదాలలో ప్రాణాలను రక్షించుకునేందుకు కారులో ఉండే ఎయిర్‌బ్యాగ్స్‌ కీలకం. ప్రస్తుతం డ్రైవర్‌సీటుకు మాత్రమే ఎయిర్‌ బ్యాగ్‌ ఉంటుంది. మిగత సీట్లకు ఉండవు. అయితే కారులో అన్ని సీటర్స్‌కు ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండాలని గతంలో కేంద్ర ప్రభుత్వం వాహనాల తయారీ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కారులో ఆరు ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండాలనే నిబంధన తీసుకువచ్చింది. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్‌తో పాటు ఇతర ప్రయాణికుల ప్రాణలు పోకుండా కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో ఈ నిబంధన తీసుకువచ్చింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని త్వరలో వాహనాల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయనున్నారనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో కేంద్రం కాస్త యూటర్న్‌ తీసుకుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. వాహనాల్లో 6 ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయదని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

గత సంవత్సరం ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 2023 నుంచి ప్రతి కారుకు 6 ఎయిర్‌ బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది మాత్రమే కాదు.. గత సంవత్సరం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో వాహనాలలో ప్రజల భద్రతను పెంచడానికి, సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనల ప్రకారం భద్రతా లక్షణాలను పెంచడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రస్తావించింది.
రోడ్డు ప్రమాదాల కారణంగా వాహన ప్రయాణికులకు కలిగే నష్టాన్ని తగ్గించడానికి దేశంలో విక్రయించే వాహనాల ముందు భాగంలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు ఏప్రిల్ 1, 2021 నుంచి తప్పనిసరి చేసింది. అంటే అన్ని కార్లు స్టాండర్డ్ 2 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉండటం తప్పనిసరి. ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన వచ్చిందని, అందుకే ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌ల నిబంధనను తప్పనిసరి చేయడం లేదని నితిన్ గడ్కరీ అన్నారు.

4 ఎయిర్‌బ్యాగ్‌లు అందిస్తే ఖర్చు పెరుగుతుంది

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. గత సంవత్సరం ప్రభుత్వం మరో నాలుగు ఎయిర్‌ బ్యాగ్‌ లను జోడించడం వల్ల ఒక్కో వాహనానికి 75 డాలర్లు (సుమారు రూ. 6,221) మించదని అంచనా వేసింది. కానీ మరోవైపు ఆటో మార్కెట్ డేటా ప్రొవైడర్ JATO డైనమిక్స్ ఇలా చేయడం వల్ల ఖర్చు కనీసం $231 (సుమారు రూ. 19,161) పెరుగుతుందని అంచనా వేసింది. ఏదీ ఏమైనా కార్లకు ఆరు ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండాలన్న నిబంధన తప్పనిసరి కాదని నితిన్‌ గడ్కరి స్పష్టం చేశారు.
Tags:    

Similar News