మిత్రవిందలా మెలికలు తిరగలేదా బాబూ? వైసీపీ ఎంపీ సెటైర్లు

Update: 2022-09-03 13:22 GMT

తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరబోతోందంటూ కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన అనంతరం పొత్తు పొడవబోతోందంటూ ప్రచారం మొదలైంది. అటు చినబాబు లోకేష్ కూడా అమిత్ షాతో భేటీ అయ్యారని చెప్పుకొచ్చారు. అయితే బీజేపీతో మళ్లీ పొత్తు ఉండబోతుందంటూ జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు మాత్రం ఆచితూచి స్పందించారు. మీడియాలో వచ్చిన కథనాల గురించి వారినే అడగాలని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మీడియాలో కథనాలకు తమకు సంబంధం లేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను ఎప్పుడూ పొత్తుల గురించి మాట్లాడలేదంటూ మళ్లీ బొల్లి కబుర్లు చెబుతున్నాడని విమర్శించారు. వన్‌సైడ్ లవ్ అంటూ విరహవేదనతో ఉన్నాడని.. ఢిల్లీలో షేక్ హ్యాండ్ ఇవ్వగానే మిత్రవిందలా మెలికలు తిరిగిపోయాడంటూ ఎద్దేవా చేశారు. వన్ సైడ్ లవ్ అయినా 2024లో వార్ మాత్రం వన్‌ సైడేనని తేల్చేశారు. అది వైసీపీ సైడేనని విజయసాయి ధీమా వ్యక్తం చేశారు.

సభ్యత్వ నమోదులో టీడీపీ చతికిలపడిందని.. టార్గెట్ పెట్టుకుని నాలుగు నెలలైనా కనీసం 20 శాతం కూడా చేరుకోలేకపోయిందని ఎంపీ అన్నారు. దీంతో అధికారంలోకి రాలేనన్న ఫ్రస్ట్రషన్‌తో చంద్రబాబు సొంత పార్టీ నేతలనే కరిచేలా ఉన్నాడని.. అందుకే నేను లేస్తే మనిషిని కాను, కేసులు పెట్టండి.. లేకపోతే సహించనంటూ టీడీపీ నేతలపై చిందులేస్తున్నాడని విమర్శించారు. బాబూ! నువ్వెప్పటికీ లేవలేవు అని విజయసాయి సెటైర్లు వేశారు. 

Tags:    

Similar News