ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావ్ బాబూ.. వైసీపీ ఎంపీ విసుర్లు

నారాయణ అరెస్టుపై వైసీపీ ఎంపీ ఘాటుగా స్పందించారు. ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2022-05-11 07:32 GMT

నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణ అరెస్టుతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారంలో ఆయనకు ప్రమేయం ఉందంటూ చిత్తూరు పోలీసులు నిన్న నారాయణను అరెస్టు చేశారు. అయితే ఆయన విద్యాసంస్థల చైర్మన్‌గా లేరని న్యాయవాదులు వాదనలు వినిపించడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నారాయణ అరెస్టు ఎపిసోడ్ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పేపర్ల లీకేజీని వ్యవస్థీకృత నేరంగా వైసీపీ నేతలు చెబుతుంటే.. కక్షపూరితంగానే కేసులు పెట్టి హింసిస్తున్నారంటూ టీడీపీ మండిపడుతోంది.

ఇదే వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. నారాయణకు చంద్రబాబు అండగా నిలవడాన్ని విజయసాయి రెడ్డి తప్పుబట్టారు. పేపర్ల లీకును సేవగా గుర్తించి పద్మశ్రీ ఇవ్వాలా ఏంటి బాబూ? అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు అండతో అతిపెద్ద ఎడ్యుకేషన్ మాఫియాను సృష్టించి లక్షలాది మంది పిల్లల జీవితాలతో నారాయణ ఆడుకున్నారని మండిపడ్డారు.

లీకుల వీరుడు నారాయణను అరెస్టు చేస్తే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావని ప్రశ్నించారు. నారాయణ విద్యాసంస్థల్లో ర్యాంకుల కోసం ఒత్తిడి భరించలేక ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. వారి తల్లిదండ్రుల ఆక్రందనలు వినపడలేదా? అని చంద్రబాబును నిలదీశారు. అందుకేనా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిని చేసిందని విమర్శించారు. 

Tags:    

Similar News