షర్మిల చెబుతోంది ఇదే!!

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే

Update: 2024-01-04 11:06 GMT

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. షర్మిలకు రాహుల్, ఖర్గేలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన తర్వాత ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

"నా తండ్రి ఏ పార్టీకి చెందినవారో పార్టీ, నా తండ్రి ఏ పార్టీలో కొనసాగారో, నా తండ్రి ఏ పార్టీ కోసం అవిశ్రాంతంగా శ్రమించారో, నా తండ్రి ఏ పార్టీ కోసం తుదిశ్వాస వరకు పరితపించారో... ఇప్పుడు ఆ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేశాం. ఆయనకు ఈ పరిణామం అమితానందం కలుగజేస్తుందనడంలో సందేహంలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నా సొంతగూటికి తిరిగొచ్చిన ఆనందం కలుగుతోంది. దేశంలోనే అతిపెద్ద లౌకికవాద పార్టీ కాంగ్రెస్. భారతదేశ బహుళత్వాన్ని, నిజమైన సంస్కృతిని నిలబెట్టే పార్టీ కాంగ్రెస్. దేశాన్ని పునాదుల నుంచి నిర్మించి, అన్ని వర్గాల వారికి అచంచల సేవలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి తిరిగొచ్చాను. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నది మా నాన్న కల. ఈ కలను సాకారం చేసేందుకు నా వంతు కృషి చేస్తాను. వైఎస్సార్ కుమార్తెగా దేశ ప్రజల కోసం కాంగ్రెస్ సైనికురాలిగా పనిచేస్తాను. విచ్ఛిన్నకర శక్తులు విజృంభిస్తున్న ప్రస్తుత క్లిష్ట సమయంలో రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడంలో, ఐక్యతను, సోదరతత్వాన్ని కాపాడడంలో చిత్తశుద్ధితో పనిచేస్తాను. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం, దేశ ప్రజల కోసం నా సర్వశక్తులు ధారోస్తాను" అంటూ షర్మిల ఉద్వేగభరితంగా ట్వీట్ చేశారు.


Tags:    

Similar News