అదే జరిగితే...?
వంగవీటి రాధా గత రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా 2004లో కాంగ్రెస్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఆయన అధికార పార్టీలో ఉండటం. ఆ తర్వాత వంగవీటి రాధా 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమిపాలయ్యారు. ప్రజారాజ్యం నుంచి తర్వాత 2014లో వైసీపీలో చేరారు. అప్పుడూ ఓటమి పాలయ్యారు. పార్టీ కూడా అధికారంలోకి రాలేకపోయింది. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరి మరోసారి తన జెండాను మార్చేశారు. అయితే 2019ఎన్నికల్లో వంగవీటి రాధాకు టిక్కెట్ కేటాయించలేదు. ఇక అప్పటి నుంచి రాధా రాజకీయంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వంగవీటి ఇంటి పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ తో ఆయన రాధా మంచి పేరున్నా ఆయనకు కలిసొచ్చే సమయం కోసం ఇప్పటి వరకూ వెయిట్ చేస్తున్నారు. ఎన్నికలు పూర్తయి తొమ్మిది నెలలు గడిచినా పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా అలాగే పార్టీకి విధేయుడిగా ఉంటూనే వస్తుండటం ఆయనకు కలసి వచ్చే అంశంగా చెప్పాలి.
కాపు కోటాలో అయినా...
జనసేన నుంచి నాగబాబు పేరు ఎమ్మెల్సీ పదవికి ఖరాయింది. అయితే ఈ సమయంలో వంగవీటి రాధాకు ఇస్తారా? లేదా? అన్న చర్చ కూడా జరిగింది. కానీ నాగబాబు వేరు. వంగవీటి రాధా వేరు. ఇద్దరినీ వేర్వేరుగా చూడాలంటున్నారు. రంగా అభిమానులు ఎక్కువగా ఉన్న ఏపీలో ఆయన తనయుడికి ఎమ్మెల్సీ అవకాం కల్పిస్తే వారు కూడా రాజకీయంగా తమకు ఉపయోగపడతారని చంద్రబాబు అంచనా.అందుకే వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఫిక్స్ అయిందని టీడీపీ వర్గాల్లో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. నాలుగు స్థానాల్లో ఒకటి వంగవీటి రాధాకు కేటాయించిన కారణంగా భవిష్యత్ లో పార్టీకి మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ చేస్తామని చెప్పినా ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోవడంతో వంగవీటి రాధా చట్టసభలకు దూరంగానే ఉన్నారు.
నారా లోకేశ్ మద్దతు...
వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి నారా లోకేశ్ కూడా సుముఖంగా ఉన్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు స్వయంగా చంద్రబాబు, లోకేశ్ లు వెళ్లి పరామర్శించి వచ్చారు. గత ఎన్నికల్లో ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించిన చంద్రబాబు ఈ జాబితాలోనే వంగవీటి రాధాపేరు ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చారంటున్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి కూడా రాధా సహకరించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాధాను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడమే మంచిదని అని పార్టీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. శాసనమండలిలో ఎమ్మెల్సీ పదవులన్నీ కూటమికే రానుండటంతో అందులోతొలి జాబితాలోనే వంగవీటి రాధా పేరు ఉందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈరోజు, రేపట్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని చెబుతున్నారు. వివాదాలకు దూరంగా ఉండే వంగవీటి రాధా కు పదవి ఇవ్వడం వల్ల కూటమి మొత్తానికి ఉపయోగకరమని మూడు పార్టీలు విశ్వసిస్తున్నాయి.