ఏపీలో పెరిగిన పాల ధర.. లీటరుపై రూ.2 పెంపు
తాజాగా ప్రముఖ పాలబ్రాండ్ పాల ప్యాకెట్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కృష్ణా మిల్క్ యూనియన్ నుంచి..
vijaya milk price
ప్రజలకు రోజూ కావలసిన నిత్యవసర వస్తువుల్లో పాలు కూడా ఒకటి. పల్లెటూళ్ల నుంచి పట్టణాలు, నగరాలు, మెట్రో సిటీలు ఇలా ప్రతి ఊరిలోనూ పాల వాడకం ఉంటుంది. తెల్లవారితే టీ, కాఫీలు తాగనిదే చాలా మందికి రోజు మొదలవదు. తాజాగా ప్రముఖ పాలబ్రాండ్ పాల ప్యాకెట్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కృష్ణా మిల్క్ యూనియన్ నుంచి వస్తోన్న విజయ పాల ధర పెరిగింది. అరలీటరు ప్యాకెట్ సహా ఆరు రకాల ప్యాకెట్ల ధరలను రూపాయి చొప్పున పెంచుతున్నట్లు తెలిపింది.
తాజాగా పెంచిన ధరలతో..అర లీటరు లో ఫ్యాట్ (డీటీఎం) ధర రూ.27, ఎకానమీ (టీఎం) రూ. 29, ప్రీమియం (స్టాండర్డ్) రూ. 31, స్పెషల్ (ఫుల్క్రీమ్) రూ. 36, గోల్డ్ రూ. 37, టీ మేట్ ధర రూ. 34కు చేరినట్లు కృష్ణా మిల్క్ యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు తెలిపారు. అయితే చిన్న పాలప్యాకెట్లు, పెరుగు, ఇతర పాల పదార్థాల విక్రయాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నారు. పాల సేకరణ ధరలు పెరగడం, నిర్వహణ, రవాణా ఖర్చులు అధికం కావడంతోనే ధర పెంచాల్సి వచ్చిందని వివరించారు. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.