ఉన్మాదిలా చంద్రబాబు.. దమ్ముంటే రాప్తాడులో నాపై పోటీ చేసి గెలువు: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

ఉన్మాదిలా చంద్రబాబు.. దమ్ముంటే రాప్తాడులో నాపై పోటీ చేసి గెలువు: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

Update: 2022-05-22 05:08 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని, వర్గాలుగా విడగొట్టి ఓట్లు పొందాలని కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. నాడు ప్రైవేటు సైన్యాలతో దాడులు చేయించారని.. తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని అంతమొదించడానికి కుట్రలు చేశారన్నారు. రక్తం పారించే చరిత్ర మీదైతే.. నీరు పారించిన చరిత్ర మాది. ఎలాగైనా గెలవాలి.. పౌరుషంగా పోరాడండని రెచ్చగొడుతున్నారు. దశాబ్దాల పాటు రక్తం పారిన ప్రాంతంలో నీరు పారించాం. మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశామని తోపుదుర్తి అన్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయించి వెళ్లిపోయావ్.. కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇది చాలదా నిన్ను ఆర్థిక ఉన్మాది అనడానికి అంటూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు వాగుడే వాగుడు కార్యక్రమం చేపట్టారని ఆయన ప్రజలకు ఏం చేశాడో చెప్పకుండా ఏదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమలో సీట్ల కోసం రక్తపాతం సృష్టించి ఫ్యాక్షన్ ఉన్మాదిగా చంద్రబాబు మారారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు.

గత మూడు నెలల్లో 7హత్య కేసులు నమోదైతే చేసిందంతా తెలుగుదేశం పార్టీ నాయకులని, హత్యకు గురైంది మాత్రం వైసీపీ నాయకులు అని అన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అధికారం లేకపోతే బ్రతకలేను అనే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని.. ప్రజలను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. రాప్తాడు పై సవతి తల్లి ప్రేమ చూపించింది నువ్వు కాదా అంటూ నిలదీశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించారు. రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రోడ్ షో నిర్వహించి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.


Tags:    

Similar News