Chandrababu : జగన్ మీ పార్టీ గుర్తు గొడ్డలిని పెట్టుకో... గర్జించిన చంద్రబాబు

జగన్ చేసేవి అన్నీ హత్యా రాజకీయాలేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కొవ్వూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు

Update: 2024-04-04 13:10 GMT

జగన్ చేసేవి అన్నీ హత్యా రాజకీయాలేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కొవ్వూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఈ జగన్ అంటూ ధ్వజమెత్తారు. నాడు బాబాయ్ ని చంపి తాను ఒంటరి వాడినంటూ జనంలోకి వచ్చారని, నేడు మళ్లీ వృద్ధులను చంపి హత్యారాజకీయాలకు దిగారని ఆయన ఆరోపించారు. వైసీపీ డీఎన్‌ఏలోనే శవ రాజకీయం ఉందన్న చంద్రబాబు ఆ పార్టీకి ఓటు వేసి రాష్ట్రాన్ని రక్తంలో ముంచవద్దని కోరారు.

సొంత చెల్లెలే...
చివరకు జగన్ కు ఓటు వేయవద్దని సొంత చెల్లెలు కూడా కోరుతుందంటే తాము చెప్పాల్సిన పనిలేదని చంద్రబాబు అన్నారు. హత్యారాజకీయాలు చేసే వారు కావాలా? లేక అభివృద్ధికి పాటుపడే వాళ్లు కావాలా? అని ఆయన ప్రశ్నించారు. తాను వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగ కాదన్న చంద్రబాబు వాళ్లు నిష్సక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వకుండా ప్రజలకు సేవలందించాలని చంద్రబాబు అన్నారు. వాళ్లు నెలకు ఐదు వేలు కాదు.. యాభై వేలు సంపాదించుకునేలా తాను చేస్తానని హామీ ఇచ్చారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లే పింఛన్లు ఇచ్చే వ్యవస్థ ఉన్నప్పటికీ ఆ పని చేయకుండా వృద్ధులను బలితీసుకుంటున్నారని అన్నారు.
అధికారంలోకి రాగానే...
తాను అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయల పింఛను నేరుగా ఇంటికే అందిస్తామని తెలిపారు. ఫ్యాన్ ను ముక్కలు చేయడానికే ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూలీల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యుత్తు ఛార్జీలను పెంచబోమని హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. నాసిరకమైన మద్యం విక్రయించమని, నాణ్యమైన మద్యాన్నే అందిస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే పేదలకు రెండు సెంట్ల భూమిని ఇస్తామని చెప్పారు.


Tags:    

Similar News