Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే.. దర్శనం సమయం చూసిన తర్వాత?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

Update: 2025-08-09 02:55 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వరస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత మూడు నెలల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఇక శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, శనివారం రాఖీపండగ, ఆదివారం వరస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుమలకు చేరుకున్న భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకుంటున్నారు.

వసతి గృహాలు దొరకడం...
తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. వసతి గృహాలు సామాన్య భక్తులకు సులువుగా లభించేందుకు అవసరమైన చర్యల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీవాణి టిక్కెట్లు తీసుకున్న వారికి దర్శనం సాయంత్రం నాలుగు గంటలకు మార్చి కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేశారు. అయినా సరే భక్తులు క్యూ లైన్ లలో ఇబ్బందులు పడకుండా అందరికీ అన్న ప్రసాదాలను, మంచినీరు, మజ్జిగను పంపిణీ చేస్తున్నారు.
ఇరవై ఆరు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,480 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,923 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.17 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News