Ashok Gajapathi Raju : రాజు గారి రైలు ప్రయాణం.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు రైల్వే స్టేషన్‌లో వెయిట్ చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Update: 2024-01-10 07:43 GMT

photo of former union minister ashok gajapathi raju 

నిజమే.. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన నేత సామాన్యుడిలా ఒక రైలులో ప్రయాణం చేయడమా? నిజమా? అబద్దమా?. నిజమైతే ఆయనను తప్పకుండా అభినందించకుండా ఉండలేం. ఎందుకంటే అశోక్‌ గజపతి రాజు పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన చేయని పదవి లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలోనే ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా అనేక సేవలు అందించారు. విజయనగరం రాజు గారిలా ఆయన దర్పాన్ని అప్పుడప్పుడు మనం చూస్తుంటాం.

రాష్ట్రమంత్రిగా ఉండి....
ఆయన రాష్ట్రమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని కాదని సొంత కారులోనే సచివాలయానికి రాకపోకలు సాగించిన వ్యక్తి అశోక్ గజపతి రాజు. పదమూడేళ్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. వాణిజ్య పన్నులశాఖ, ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా ఆయన పనిచేశారు. మంత్రిగా పనిచేసినా పూసపాటి అశోక్ గజపతి రాజులో ఎటువంటి బేషజాలు కనిపించవు. ఆయన సాధారణ వ్యక్తిలాగానే ఉంటారు. తన కుటుంబానికి వేల ఎకరాల భూములను సమాజ అభివృద్ధి కోసం పంచిపెట్టిన కుటుంబం ఆయనది. అటువంటి ఆయన రైలులో ప్రయాణించడమా? నో.. నెవ్వర్ అంటున్నారు కూడా. రాజు గారు తలచుకుంటే కార్లు వస్తాయి. విమానంలో ఎగిరి వెళతారు. కానీ ఈ రైలు ప్రయాణమేంటి?
రైల్వేస్టేషన్ లో...
ఆయన 2014లో విజయనగరం నుంచి పార్లమెంటు సభ్యుడిగా గెలిచి మోదీ ప్రభుత్వంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు కూడా. తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ వైదొలగడంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాంటి అశోక్ గజపతి రాజు ఇప్పుడు సాధారణ వ్యక్తిలో రైలులో ప్రయాణించడం ట్రెండింగ్ అయింది. ఆయన రైల్వే స్టేషన్ లో వేచి చూస్తున్న ఒక ఫొటో వైరల్ గా మారింది. ఆయన అభిమానులు అశోక్ గజపతి రాజు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళుతున్నారు? అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. నిజంగా అశోక్ గజపతి రాజు రైలు ప్రయాణం లేటెస్ట్‌దేనా? లేక పాతదా? అన్నది తెలియకున్నా ఎప్పుడైనా ఆయన రైలులో ప్రయాణించడం మాత్రం వింతేమరి అంటున్నారు నెటిజన్లు.
Tags:    

Similar News