నారా లోకేష్ కు 'రెడ్ బుక్' చిక్కులు

యువగళం పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ యువనేత నారా లోకేశ్ చేతిలో

Update: 2023-12-29 10:49 GMT

NaralokeshRedBook

యువగళం పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ యువనేత నారా లోకేశ్ చేతిలో ఓ ఎర్రని పుస్తకం(Red Book)ఉంది. తమను, తమ పార్టీ క్యాడర్ ను ఇబ్బందిపెట్టిన పోలీసులు, అధికారులు, నేతల పేర్లను ఆ రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల పని పడతామని హెచ్చరించారు. ఈ రెడ్ బుక్ అంశంలో నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ నోటీసులు పంపింది. రెడ్ బుక్ పేరుతో తమను బెదిరిస్తున్నారంటూ కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అధికారుల పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏసీబీ న్యాయస్థానం రాష్ట్ర సీఐడీకి సూచనలు చేసింది. న్యాయస్థానం సూచన మేరకు సీఐడీ అధికారులు లోకేశ్ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్నట్టు వాట్సాప్ లో సీఐడీకి లోకేశ్ బదులిచ్చారు.

నారా లోకేష్‌‌పై దాఖలైన పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ) నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంతో లోకేష్‌పై అరెస్టు ఉత్తర్వులు జారీచేయాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ ఇటీవల పిటిషన్‌ దాఖలు చేసింది. రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ నిందితుడిగా ఉన్నారని తాము జారీ చేసిన 41ఏ నోటీసులో పేర్కొన్న షరతులకు లోబడి వ్యవహరించడంలో ఆయన విఫలమయ్యారని కోర్టుకు తెలిపింది. సాక్షులను, దర్యాప్తు అధికారులను బెదిరించేలా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. సీఐడీ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు లోకేష్‌కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేసింది.



Tags:    

Similar News