Andhra Pradesh : వారి పింఛన్లను మాత్రమే తొలగించాం : కొండపల్లి శ్రీనివాస్
పింఛన్ల రద్దుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు
పింఛన్ల రద్దుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం మృతిచెందిన, శాశ్వతంగా వలసవెళ్లిన పెన్షన్లు మాత్రమే రద్దయ్యాయని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆరు నెలలకు సిక్స్ స్టెప్ వ్యాలీడేషన్ పేరుతో 5 ఏళ్లలో ఏకంగా 11 లక్షలకు పైగా పెన్షన్లు రద్దు చేసి పేదల పొట్టగొట్టారని కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.
ప్రతినెల ఠంచనుగా...
వైసీపీ ఐదేళ్ల పాలన కాలంలో ఇష్టం వచ్చినట్టు పెన్షన్లు తొలగించారని, ఆ విధంగా కూటమి ప్రభుత్వ, ఇరవై నెలల పాలనలో అన్యాయంగా ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని, పేదలకు అన్యాయం చేసే ఉద్దేశం తమకు లేదని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి, ప్రతీ నెలా స్పౌస్ పెన్షన్ కోటాలో వితంతువులకు పెన్షన్ మంజూరు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.