అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారీగా పోలీసులు మోహరించారు

Update: 2023-09-02 05:23 GMT

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. పలుచోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. అమలాపురం మండలం ఈదరపల్లిలో వైసీపీకి చెందిన పోలిశెట్టి కిషోర్ అనే వ్యక్తిని హత్యకు గురయ్యాడు. కొంతమంది ‌గుర్తుతెలియని దుండగులు ఈ హత్య చేశారు. ఈ ఘటనపై అమలాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాజీ హోం మంత్రి, టిడిపి నేత నిమ్మకాయల చిన రాజప్ప ప్రధాన అనుచరుడు గంధం పళ్ళంరాజుకు చెందిన అమలాపురంలోని రియల్ ఎస్టేట్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.

అమలాపురం మండలం ఈదరపల్లిలో పోలిశెట్టి కిషోర్‌ అనే యువకుడి హత్య కలకలంరేపింది. శుక్రవారం మధ్యాహ్నం కర్రలతో కిషోర్, అడపా సాయిలక్ష్మణ్‌‌లపై దాడి జరిగింది. ఈ ఘటనలో కిషోర్‌ అక్కడికక్కడే మృతిచెందగా, సాయిలక్ష్మణ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కిషోర్‌ మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడికి పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. దాడి ఘటనతో ఈదరపల్లికి చెందిన సతీష్‌, ఇంద్ర, గూడాలకు చెందిన సుధీర్‌, కొంకాపల్లికి చెందిన ఆనంద్‌ అనే యువకులకు సంబంధం ఉన్నట్లు గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. 200 మంది పోలీసులతో పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. డీఐజీ జీవీజీ అశోక్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ పర్యవేక్షణలో దాదాపు 200 మంది సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేశారు. అమలాపురంలో ముందుజాగ్రత్త చర్యగా పట్టణంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News